అన్నా.. చెల్లెలికి మధ్య జరిగే యుద్ధం, మేం సిద్ధమే..: కేసీఆర్పై విజయశాంతి
హైదరాబాద్: ఎన్నికల యుద్దానికి తమ పార్టీ సిద్దంగా ఉందని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ విజయశాంతి తెలిపారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం విజయశాంతి మాట్లాడారు.
విజయశాంతికి కీలక పదవులు: రేవంత్కు ప్రాధాన్యతపై సీనియర్ల అసంతృప్తి, 'సురేష్ రెడ్డి పేరు'
అన్నా.. చెల్లెలికి జరిగే యుద్ధం
రాబోయే రోజుల్లో శుత్రవులతో యుద్దానికి సిద్దమవుతున్నామని, శత్రువును ఓడగొట్టి ప్రజలకు మేలు చేస్తామని విజయశాంతి అన్నారు. సీఎం కేసీఆర్ తనను దేవుడిచ్చిన చెల్లి అన్నారని, ఈ అన్నా, చెల్లెల మధ్య పోరాటానికి ప్రజలే తీర్పు చెబుతారన్నారు.
రాహుల్కు ధన్యవాదాలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు అప్పజెప్పిన తమ అధినేత రాహుల్ గాంధీకి విజయశాంతి ధన్యవాదాలు తెలిపారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చానని, తన గురించి తర్వాత మాట్లాడుతానని చెప్పారు. తాను తొలిసారి గాంధీభవన్లో అడుగుపెట్టానని తెలిపారు.
టీఆర్ఎస్ నుంచి విముక్తి...
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ప్రచార సభలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు. టీఆర్ఎస్ బానిసత్వం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడానికి పోరాడుతామన్నారు. అందరం ఏకమై టీఆర్ఎస్ గద్దె దించుదామని డీకే అరుణ పిలుపునిచ్చారు.
నాలుగున్నరేళ్లలో జరిగింది దోపిడీనే
ఈ ఎన్నికలు దొరలకు, ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణ దోపిడీకి గురయ్యిందని అన్నారు. ప్రజా గాయకులు గద్దర్, గోరెటి వెంకన్న, విమలక్కలను తమతో కలిసి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రజల ప్రభుత్వం ఏర్పాటుకు అందరిని కలుపుకొని పోతామని తెలిపారు. బస్సు యాత్రలు, సభలు, రోడ్ షోలకు సబంధించిన వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, దాసోజు శ్రవణ్ కుమార్లు పాల్గొన్నారు.