విజయవాడ నుంచి సికింద్రాబాద్ మూడున్నర గంటలే.. సిద్ధమవుతున్న కొత్త రైల్వే లైన్
విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల, నల్గొండ మీదుగా సికింద్రాబాద్ చేరుకోవడానికి తక్కువలో తక్కువగా ఐదున్నర నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. వందేభారత్ లాంటి రైళ్లకైతే నాలుగు గంటల సమయం పడుతోంది. గుంటూరుకు సమీపంలోని నల్లపాడు నుంచి బీబీనగర్ వరకు సింగిల్ లైన్ ఉండటంతో ఇంత సమయం పడుతోంది. ఒక రైలు ఎదురు వస్తుంటే మరో రైలును వేరే స్టేషన్ లో నిలిపివేస్తారు. దీనివల్ల సమయం వృథా అవుతోంది. దీంతో గతేడాది కేంద్ర ప్రభుత్వం నల్లపాడు నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా బీబీనగర్ వరకు రెండో మార్గం పూర్తిచేయడానికి రూ.2853 కోట్లు విడుదల చేసింది.
ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే
మొత్తం 248 కిలోమీటర్ల పొడవునా డబుల్ ట్రాక్ వేయడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అవసరమైనచోట భూముల కోసం అధికారులు ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తిచేశారు. 2027కల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు గుంటూరు నుంచి సికింద్రాబాద్ కు కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చు. విజయవాడ నుంచి మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. సికింద్రాబాద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నంకు విజయవాడ మీదుగా ఒక మార్గం ఉండగా, గుంటూరు మీదుగా మరో మార్గం ఉంది. అంతేకాకుండా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గం పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ మార్గానికి కూడా నడికుడి వద్ద అనుసంధానం చేస్తారు.

ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి
డబుల్ ట్రాక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరిన్ని రైళ్లను అధికారులు తిప్పనున్నారు. అంతేకాకుండా విజయవాడ మీదుగా వెళ్లే చాలా రైళ్లను ఇటువైపు దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అప్పుడు రెండు మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఒక మార్గం గుంటూరు మీదుగా వెళ్తే, మరో మార్గం నడికుడి నుంచి వెళుతుంది. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు సికింద్రాబాద్ చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం దొరికినట్లవుతుంది.












Click it and Unblock the Notifications