మారిన రైల్వే నిబంధనలు: తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే సగం వెనక్కి
హైదరాబాద్: భారతీయ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'వికల్ప్' పథకాన్ని మరింతగా విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. బెర్త్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు వెయిటింగ్ జాబితాలో బెర్త్ దొరక్కపోతే, అందుకు ప్రత్యామ్నాయంగా వారు కోరుకున్న మరో రైలులో బెర్త్ సదుపాయం కల్పించే ప్రక్రియే 'వికల్ప్' పథకం.
'వికల్ప్' పేరుతో ఇప్పటికే అమలు చేస్తున్న ఈ సదుపాయాన్ని కొత్తగా ఢిల్లీ నుంచి హౌరా, ముంబై, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్ మార్గాలకు పొడిగించనున్నట్టు రైల్వే శాఖ సోమవారం వెల్లడించింది. వికల్ప్తో పాటు ఐదు కొత్త పథకాలను సోమవారం రైల్వే మంత్రి సురేష్ ప్రభు ముంబైలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ బడ్జెట్ సమయంలో వికల్ప్ను ప్రకటించామని అందుకే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. వికల్ప్ పథకం కేవలం మెయిల్/ఎక్స్ప్రెస్ లేదా సూపర్ ఫాస్ట్ రైళ్లలో మాత్రమే అందుస్తామన్నారు. రాజధాని, శతాబ్ధి, దురంతో రైళ్లకు ఈ పథకం వర్తించదన్నారు.

వికల్ప్ కింద ప్రత్యామ్యాయ వసతి కల్పించాక ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అనుమతించబోమన్నారు. చార్జీలో తేడాలున్నా రీఫండ్ ఇవ్వరు.ఎలాంటి అదనపు చార్జీలు కూడా ఉండవని తెలిపారు. ఇందులో ఏడు మార్గాల్లో ఎక్స్ప్రెస్ రైళ్లు, రిజర్వు చేసుకోని టికెట్ల బుకింగ్కు సులువైన మార్గం, కాపలాలేని లెవల్ క్రాసింగ్ల వద్ద భద్రత, ట్రాక్మెన్, గ్యాంగ్మెన్కు తేలికైన టూల్కిట్లు వంటివి ఉన్నాయి.
ఇక రిజర్వు చేసుకోని టికెట్ల బుకింగ్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. దేశంలో కాపలా లేని లెవల్ క్రాసింగ్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిని నివారించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందస్తు హెచ్చరిక చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఇందుకోసం రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా క్రాసింగ్ల వద్ద రైలు వచ్చేముందు సిగ్నల్స్ వచ్చేలా ఏర్పాటు చేసి, రోడ్డుపై ట్రాక్ ను దాటివెళ్లే వారిని అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు. రైలు డ్రైవర్కూ లెవల్ క్రాసింగ్ వద్ద దృశ్యం కనిపించే ఏర్పాటు చేస్తారు. అలాగే రైల్వే ట్రాక్ల ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరమ్మతులు చేసే ట్రాక్మెన్, గ్యాంగ్మెన్, గస్తీ బృందం తమవెంట మోసుకెళ్తున్న టూల్కిట్ బరువు 26 కిలోలు ఉంటోంది.
దీనిని 16 కిలోలకు తగ్గిస్తూ రూపొందించిన టూల్కిట్ను రైల్వేమంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు.
జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి:
* తత్కాల్ టికెట్లను రద్దు చేసుకుంటే సగం మొత్తం వెనక్కిస్తారు. ప్రస్తుతం ఇందులో రీఫండ్ సౌకర్యం లేదు.
* తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పు. ఏసీ బుకింగ్లకు ఉదయం 10 నుంచి 11 వరకు. స్లీపర్ కోచ్ టికెట్ బుకింగ్ ఉదయం 11 నుంచి 12 వరకు.
* ప్రాంతీయ భాషల్లోనూ టికెట్ బుకింగ్ రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో బోగీల సంఖ్య పెంపు. దీనివల్ల ఎక్కుమంది కన్ఫర్మ్ టికెట్స్ పొందొచ్చు.
* సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయం. ఇవి రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ మాదిరి తక్కువ స్టాప్లు ఉంటాయి.
* ప్రీమియం సర్వీసు రైళ్లకు ముగింపు. రైళ్లలో ప్రయాణికులకు గమ్యస్థానం వచ్చేటప్పుడు అప్రమత్తం చేసేందుకు 'వేకప్ కాల్' సౌకర్యం.












Click it and Unblock the Notifications