ఓటెత్తుతున్న తెలంగాణ - ఓటరు నాడి సుస్పష్టం..!!
తెలంగాణ ఓటెత్తుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు కనిపిస్తున్నారు. రాజకీయ - సినీ ప్రముఖులు తొలి గంటలోనే ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరుతున్నారు. స్వల్ప ఘర్షణలు..కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక..ప్రధాన పార్టీలు ఓటరు మూడ్ పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ లో ఓటరు నిర్ణయం ఏంటనేది సుస్పష్టం అవుతోంది.
కొనసాగుతున్న పోలింగ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల ముందు నుంచే బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హోరా హోరీగా సాగిన ప్రచారం తరువాత ప్రధాన పార్టీలు తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక..పోలింగ్ లో కనిపిస్తున్న స్పందన చూసి అసలైన తీర్పును తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ పోలింగ్ వేళ హైదరాబాద్ నగరంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రధాని మోదీ రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండని కోరారు.
బారులు తీరిన ఓటర్లు: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్లలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఈవీఎంలు పని చేసే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి వస్తున్నారు. దీంతో..ఈ ఉత్సాహం ఎవరికి కలిసి వస్తుందనే లెక్కల్లో పార్టీలు నిమగ్నమయ్యాయి.
పోటీలో ఉన్న అభ్యర్దుల్లో ఓటరు తీర్పు పైన టెన్షన్ పెరుగుతోంది. అటు పోలింగ్ జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ వేళ ప్రభావితం చేసే వ్యాఖ్యలపైన ఆంక్షలు ఉన్నా.. నేతలు మాత్రం ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఓటరు నాడి సుస్పష్టం: ఈ సారి తెలంగాణలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో మెజార్టీ ఓటర్లు ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చారు. ఓటర్లను చివరి నిమిషం వరకు తమ వైపు తిప్పుకొనేందుకు పార్టీలు ప్రయత్నాలు చేసాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా అభివృద్ధి..సంక్షేమం అజెండాగా కనిపిస్తోంది. ఈ రెండు అమల్లో ముందున్న తమకే ఓటర్లు పట్టం కడతారని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ భావిస్తోంది.
బీజేపీ తమ నిర్ణయాలతో సామాజిక సమీకరణాలు మారి తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ, ఈ హోరా హోరీ పోరులో ఎవరు గెలిచినా మ్యాజిక్ ఫిగర్ మించి ఏ స్థాయిలో ఉంటుంది..అసలు తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఈ పోలింగ్ ట్రెండ్స్ లో స్పష్టత కనిపిస్తోంది. కానీ, అధికారికంగా మాత్రం డిసెంబర్ 3న వెల్లడి కానుంది.












Click it and Unblock the Notifications