తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: కేసీఆర్ సర్కారుపై యుద్ధమంటూ బీఎల్ సంతోష్
హైదరాబాద్: తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ఆ పార్టీ కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు బీఎల్ సంతోష్.
డ్రగ్స్ దందా చేసేది కేసీఆర్ ఫ్యామిలేనంటూ బీఎల్ సంతోష్
ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు తమపై కుట్ర మోపినవారికి చెంప ఛెల్లుమనేలా ఉందన్నారు. భారతమాత, ధర్మం కోసం పనిచేసే వారిపై కేసీఆర్ కుట్ర చేశారని బీఎల్ సంతోష్ మండిపడ్డారు. డ్రగ్స్ దందా చేసేది సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులేనని ఆరోపించారు. బెంగళూరు డ్రగ్స్ కేసును తిరిగతోడుతామని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీదే అధికారమన్న బీఎల్ సంతోష్
తమకు జైలు కొత్త కాదని, కేసీఆర్ కూతురు లాగా సారా కేసులో వెళ్లలేదని బీఎల్ సంతోష్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ సర్కారుపై యుద్ధం ప్రారంభించామని.. ఒక ఏడాదిలో బీజేపీని అధికారంలోకి తెస్తామని బీఎల్ సంతోష్ స్పష్టం చేశారు.
పార్టీ కోసం యుద్ధం చేసేవారికి అండగా బీజేపీ అంటూ సంతోష్
తెలంగాణలో ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి.. కాషాయపు జెండాను ఆదరించాలన్నారు. 80 శాతం హిందువుల కోసం పనిచేసేది బీజేపీ మాత్రమేనని బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు. పార్టీ కోసం యుద్ధం చేసేవారికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హిందువుల సనాతన ధర్మాన్ని కించపరిస్తే భరించలేమని అన్నారు. హిందువుల మేలు కోసం పనిచేస్తామన్నారు.
ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్ సహా వారికి ఊరట
కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుస్వామి, తుషార్ వెల్లాపల్లి, బూసారపు శ్రీనివాస్ లను నిందితులు చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. మొదటి ముగ్గురు నిందితుల నేరాంగీకర వాంగ్మూలంలో ఎక్కడా ఈ నలుగురి పేర్లు లేవని, ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ తదితరాల్లోనూ ఈ నలుగురి పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఏసీబీ చట్టం కింద కేసుల్ని శాంతిభద్రతల పోలీసులుగానీ, సిట్ గానీ దర్యాప్తు చేయకూడదనే అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటోంది. అయితే, ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.