ఎమ్మెల్యే గాదరి Vs దాసోజు: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే దవడ పగుల్తది-దళిత బంధు చర్చలో మాటల యుద్ధం
తెలంగాణ రాజకీయ వర్గాల్లో,సామాన్యుల్లో ప్రస్తుతం 'దళిత బంధు' పథకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేసీఆర్ సంధించబోతున్న ఈ అస్త్రం ఎవరికి లాభం,ఎవరికి నష్టమనే విశ్లేషణలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఇది ఆచరణ సాధ్యమేనా... కేసీఆర్కు దీన్ని పూర్తి చేసే చిత్తశుద్ది ఉందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. టీవీ చానెళ్లు నిరంతరం దీనిపై డిబేట్లు నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రధాన పార్టీల నేతలు,ప్రజా సంఘాల సభ్యులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. తాజాగా ఓ టీవీ ఛానెల్ వేదికగా దీనిపై జరిగిన చర్చా కార్యక్రమం ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్,కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు.

దాసోజు శ్రవణ్ ఏమన్నారు...
'ఇల్లు అలకగానే పండగ కాదు... గతంలో టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఎంత ఉత్సాహంతో గతంలో పథకాలు ప్రకటించి ఆ తర్వాత వాటిని పూర్తి చేయలేదు. కేవలం ఎన్నికల కోసమే దళిత బంధు ప్రకటించారనే దానికి వాసాలమర్రిలో అమలుచేయడమే పెద్ద ఉదాహరణ. ఐఏఎస్లను,ఇతర ఉన్నతాధికారులను పంపించి.. దళితుల స్థితి గతులు తెలుసుకుని దళిత బంధు అమలుచేస్తామన్నారు. కానీ అది జరగకముందే వాసాలమర్రిలో అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. 12 లక్షల మంది లబ్దిదారులకు ఇస్తేనే పథకం అమలైనట్లు. రాష్ట్రంలోని 12వేల పల్లెల్లో అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి పథకం అందాలి. కానీ ఇవాళ్టికి దానికి విధి విధానాలు లేవు. ఆ నిధులను ఏ రకంగా వాడుకోవాలె... ఏ సహాయ సహకారాలు అందిస్తారనేది తెలియదు. కేవలం ఆరంభ శూరత్వంగా కాకుండా 12 లక్షల దళిత కుటుంబాలకు దీన్ని అందించాలి. వెంటనే ఆ 12 లక్షల మంది జాబితా ప్రకటించండి. దాని విధి విధానాలు ప్రకటించండి.' అని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

గ్యాదరి కిశోర్ ఏమన్నారు...
'కేసీఆర్ తీసుకొస్తున్న దళిత బంధు పథకంతో రాజకీయ పార్టీల భూమి కంపిస్తోంది. పథకాన్ని ప్రకటిస్తే మొదలుపెట్టడు అంటారు... మొదలుపెడితే ఇల్లు అలకగానే పండగ కాదంటారు.. మీకు చేతనైతే,మీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటివి అమలుచేయండి. 100శాతం ఎన్నికల కోసమే అని కేసీఆర్ గానే స్వయంగా చెప్పారు. చేయకపోతే చేయలేదని ఏడుపు... చేద్దామని మొదలుపెడితే ఇల్లు అలకగానే పండగ కాదంటున్నారు. విధి విధానాలు ప్రకటిస్తారండి... దళిత సాధికారతపై జరిగిన సమీక్ష సమావేశంలో కుటుంబానికి రూ.3లక్షలు,రూ.5లక్షలు ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి రూ.10లక్షలు చొప్పున ఇద్దామన్నారు. దశలవారీగా దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మొదట అట్టడుగున ఉన్నవారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడున్న ఎస్సీ లోన్లు కొనసాగుతున్నాయి. వాటి ద్వారా 5లక్షలు సబ్సిడీ,5లక్షలు బ్యాంకు లింకేజీతో అందుతున్నాయి. ఇటువంటి లింకులు లేకుండా పూర్తిగా రూ.10లక్షలు నగదును దళితుల ఖాతాల్లో వేయబోతున్నాం. సీనియర్లకు కొంతమందికి అవగాహన మాట్లాడుతున్నారు.మంచి పథకాన్ని తీసుకొస్తున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తే దళితులు బాగుపడుతారు. గతంలో బెంగాల్,బిహార్లో ఎన్నికల వేళ బీజేపీ ప్యాకేజీలు ప్రకటించలేదా... పథకాన్ని నేను విశ్వసించను అంటున్నారు.అది విశ్వసించాల్సింది ప్రజలు... దళిత వ్యతిరేకిగా మాట్లాడినా... దళితుల అభివృద్దిని ఓర్చుకోలేకపోయినా ప్రజలు బుద్ది చెబుతారు. సందర్భం కలిసి వచ్చింది కాబట్టి వాసాలమర్రిలో సీఎం పథకాన్ని ప్రకటించారు.' అని శ్రవణ్ చెప్పుకొచ్చారు.

కిశోర్-శ్రవణ్ మాటల యుద్ధం...
ఇదే క్రమంలో గ్యాదరి కిశోర్,దాసోజు శ్రవణ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. దాసోజు శ్రవణ్.'ప్రతిపక్షాల కాళ్ల కింద భూమి కంపించలేదు. హుజురాబాద్ ఉపఎన్నికతో... కుర్చీ కంపించింది కేసీఆర్కే...' అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. మధ్యలో జోక్యం చేసుకున్న కిశోర్.. 'అక్కడ ఓడిపోతే లేదా గెలిస్తే కుర్చీ కిందా మీద అవుతదా. అవగాహనతో మాట్లాడాలె.' అని బదులిచ్చారు. కిశోర్ వ్యాఖ్యలపై శ్రవణ్ స్పందిస్తూ.. 'నువ్వు పెద్ద ప్రొఫెసర్వి.. యూనివర్సిటీలో చదువుకున్నోడివి... వినవయ్యా... పెద్ద ఓపిక లేకుండా మాట్లాడుతున్నావు..' అని ఫైర్ అయ్యారు. శ్రవణ్ వ్యాఖ్యలపై కిశోర్ తీవ్ర స్థాయిలో స్పందించారు... 'డ్రామాలు చేయకు.. దళితులకు ఇస్తానంటే మీకు కష్టమవుతోంది.' అని మండిపడ్డారు. దీంతో 'పద్దతిగా మాట్లాడు... ఇదేనా సంస్కారం... ఊకోవయ్యా.. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు...' అని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై కిశోర్ మాట్లాడుతూ... 'మొదట నువ్వు మాట్లాడావు సంస్కారహీనుడిగా... ఒక ఎన్నికలో గెలిచే సత్తా లేదు గానీ పెద్దగా మాట్లాడుతున్నావు... దవడ పగుల్తది ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే...' అని ఫైర్ అయ్యారు.

గైడ్ లైన్స్ ఉండాలనడం తప్పా : దాసోజు శ్రవణ్
ఆ తర్వాత ఇద్దరు నేతలు శాంతించి చర్చను కొనసాగించారు. 'ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదు... టీఆర్ఎస్ ఉలికిపడుతోంది కాబట్టే.. నా మీద దాడి చేసినంత పని చేస్తున్నారు. సబ్ ప్లాన్ చట్టం అమలు కోసం గతంలో టీఆర్ఎస్ ప్రతినిధిగా అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను.అనేక దళిత ఉద్యమాల్లో నేను భాగస్వామిని అయ్యాను. సబ్ ప్లాన్లో ఏమేం చేర్చాలో రాసింది నేను... ఆ చట్టాన్ని ఎందుకు అమలుచేయట్లేదు... ఎస్సీ లోన్ల కోసం 9,15,000 అప్లికేషన్లు వస్తే... కేవలం లక్ష మందికి ఇచ్చారు... ఇవేవీ కూడా అమలుచేయలేదు... అందుకే ఈ పథకాన్ని నమ్మడానికి సిద్దంగా లేము.. పథకానికి గైడ్ లైన్స్ ఉండాలనడం తప్పా... 12 లక్షల మంది అర్హుల లిస్ట్ ఇవ్వమనడం తప్పా... ఆ డబ్బులు తాగుడు,తందనాలకు ఖర్చు చేయకుండా,వారి బతుకులు బాగుండాలని సపోర్ట్ ఇవ్వమనడం తప్పా...' అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

మూడెకరాల పంపిణీ అందుకే అమలవలేదు : కిశోర్
దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలపై గ్యాదరి కిశోర్ స్పందిస్తూ... 'తాగుడు తందనాలకు అని ఎట్లా మాట్లాడుతారు... శ్రవణ్ అన్న ఇందాక నన్ను అపార్థం చేసుకున్నారు... ఎస్సీ సబ్ ప్లాన్ అమలుచేసిన కాంగ్రెస్ నియమ నిబంధనలు పెట్టలేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఎస్సీ డెవలప్మెంట్ యాక్ట్ కింద మార్చారు. నిధులు మిగిలితే క్యారీ ఫార్వార్డ్ చేయాలనే నిబంధన చేర్చారు. ఆ ప్రక్రియలో నేను కూడా భాగస్వామిగా ఉన్నా. ఎస్సీ డెవలప్మెంట్లో దేనికెంత ఖర్చు చేస్తున్నారో ప్రజాప్రతినిధులకు వివరాలు ఇస్తున్నారు.గతంలో ఇచ్చిన మూడెకరాల భూమి హామీ అమలుకాకపోవడానికి కారణం అనూహ్యంగా భూముల ధరలు పెరగడమే. దానికి ప్రత్యామ్నాయంగా దళిత బంధు లాంటి పథకంతో ముందుకెళ్తున్నారు. మంచి జరిగితే అందరు ఆహ్వానించాలి. సలహాలు,సూచనలు ఇస్తే తీసుకుంటాం. ప్రజలు ఎవరినైతే విశ్వసించరో వారికి ఓటు ద్వారా వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారు. కాబట్టి విధి విధానాలు రూపొందించలేదని తొందరపాటు వ్యాఖ్యలు చేయవద్దు.' అని కిశోర్ పేర్కొన్నారు.

మందకృష్ణ రియాక్షన్
'దళితులమై మేము రుణపడి ఉన్నామంటే మహాత్మా జ్యోతిరావ్ పూలే,అంబేడ్కర్,బాబు జగ్జీవన్ రామ్కు మాత్రమే. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కిశోర్ లాంటి వాళ్లు దళిత సమాజం తరుపున గట్టిగా నిలబడుతారని కోరుకుంటాం. అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించాలని కోరుకుంటాం. మమ్మల్ని సమావేశానికి పిలవకపోయినా దళిత సాధికారత పథకాన్ని ఆహ్వానించాం. ఆ నిర్ణయాల వల్ల దళిత సమాజం ఎంతో కొంత మేలు జరుగుతుంది కాబట్టి. పథకాన్ని ఎక్కడ మొదలుపెట్టినా స్వాగతిస్తాం.అయితే దళిత సాధికారత ఏడేళ్లు ఎందుకు ఆలస్యమైంది... దళితుడే ముఖ్యమంత్రిగా ఉంటే... ఇంత ఆలస్యమయ్యేదా.. మూడెకరాల భూ పంపిణీ ఏం జరిగిందో తెలుసు... ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకున్నట్లు ముందుకొచ్చారు... 7లక్షల మందికి ఇస్తామన్నారు.. కానీ ఒక్క శాతం కూడా పూర్తి కాలేదు. రెండో సంవత్సరం నుంచి బడ్జెట్ కేటాయించలేదు.కాబట్టి కిశోర్ లాంటి నేతలు దళిత బంధు పథకాలను,ప్రభుత్వ వైఖరిని సమర్థించేటప్పుడు వాస్తవాలు పరిశీలించాలి. గత హామీల్లా ఇది కూడా మిగిలిపోకుండా చూసుకునే బాధ్యత కిశోర్ లాంటి నేతలపై ఉన్నది.' అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications