వరల్డ్ ఫేమస్.. మన వరంగల్ 'చపాటా' మిర్చి.. ప్రత్యేకతలివే
తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తికి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో పండించిన బియ్యం ఫిలిప్పీన్స్ కు సరఫరా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా వరంగల్ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఐడెంటిటీ లభించింది. ఈ మేరకు చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ సర్టిఫికేట్ ఇస్తూ భౌగోళిక గుర్తింపు సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ నుంచి జీఐ ట్యాగ్ పొందిన 18వ ఉత్పత్తిగా చపాటా మిర్చి నిలిచింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని జెన్నారెడ్డి వెంకటరెడ్డి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త కే. భాస్కర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించాయి. చపాటా మిర్చికి GI ట్యాగ్ కోసం 2022లోనే చెన్నైలోని ఇండియన్ పేటెంట్ సంస్థకు అప్లై చేశారు. ఎట్టకేలకు దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వరల్డ్ ఫేమస్ మిర్చి..
చపాట మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గిరాకీ ఉంది. చపాట మిర్చి ఎరుపు రంగులో ఉంటుంది. కారం తక్కువగా ఉంటుంది. దీంతో ప్రపంచ మార్కెట్లో ఈ మిర్చికి డిమాండ్ అధికం. ఇందులో ఒలియోరెసిన్ ( మిరప నుంచి తీసే నూనే) శాతం.. మిగతా మిర్చి రకాలతో పోల్చితే తక్కువగా ఉంటుంది కాబట్టి ఘాటు తక్కువగా ఉంటుంది. చైనా, యూకే, యూఎస్, జర్మనీతో పాటు ఇరత యూరోపియన్ దేశాల్లో ఈ మిర్చికి మంచి డిమాండ్ ఉంది.
ధర ఎంతంటే..
వరంగల్ చపాటా మిర్చి క్వింటా ధర రెండేళ్ల క్రితం రూ. లక్ష దాకా పలికింది. ప్రస్తుతం చపాటా మిర్చి కిలో ధర మార్కెట్లో కేజీ రూ.300 దాకా ఉంది. జీఐ ట్యాగ్ వల్ల దీని ధర కిలోకు రూ.450 నుంచి రూ.500 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మిర్చి పొడిని పచ్చళ్లు, మిఠాయిలు, ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలు, పానీయాలు, ఔషధాలు, వస్త్ర పరిశ్రమల్లో సైతం ఈ మిర్చిని రంగు కోసం వాడతారు.
ప్రస్తుతం హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో దాదాపు 20 వేల మంది రైతులు చపాటా మిర్చిని పండిస్తున్నారు. దాదాపు 7వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నడికూడ మండలంలో చపాటా మిర్చి ఎక్కువగా సాగు అయ్యేది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అధికంగా సాగు అవుతోంది.












Click it and Unblock the Notifications