లోకాయుక్త లంచం కేసు: వరంగల్ వ్యక్తి అరెస్టు
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్తలో జరిగిన లంచం స్కాం కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులు ఒక్కరిని అరెస్టు చేశారు. తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్ (30) అనే యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ప్రత్యేక బృందం అధికారులు తెలిపారు.
లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు. శనివారం లోపు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులలో స్పష్టం చేశారు.
అశ్విన్ రావ్, అశోక్ కుమార్ స్నేహితులని విచారణలో వెలుగు చూసింది. బెంగళూరు నగరంలోని రాజాజీనగరలో అశోక్ కుమార్ నివాసం ఉంటున్నాడు. తెలంగాణలోని వరంగల్ కు చెందిన అశోక్ కుమార్ బెంగళూరు చేరుకుని సెక్యూరిటి ఏజెన్సీలో పని చేసేవాడు.
ఆ సందర్బంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అశ్విన్ రావ్ తో అశోక్ కుమార్ కు పరిచయం ఎర్పడింది. తరువాత అశోక్ కుమార్ ఉద్యోగం నిలిపివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని వెలుగు చూసింది.
లోకాయుక్త లంచం స్కాం కేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన లోకాయుక్త ఎస్పీ సానియా నారంగ్ ఎఫ్ఐఆర్ తయారు చేశారు. అందులో అశ్విన్ రావ్ మొదటి ముద్దాయి. అశోక్ కుమార్ రెండవ ముద్దాయిగా పేర్లు నమోదు అయ్యాయి. సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం అశోక్ కుమార్ ను లోకాయుక్త న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
న్యాయమూర్తి అనుమతితో 10 రోజులు అతనిని కస్టడికి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో అశ్విన్ రావ్ ను విచారణ చెయ్యడానికి ఎస్ఐటి అధికారులు సిద్దం అయ్యారు. అశ్విన్ రావ్, అశోక్ కుమార్ ల మద్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అని ఎస్ఐటి అధికారులు ఆరా తీస్తున్నారు.