డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రతపై వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం అవేకన్; అదరగొట్టిన ర్యాంప్ వాక్!!
మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువతలో మార్పు తీసుకురావడానికి, మత్తుపదార్థాలను పారద్రోలి యువత భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, రోడ్ సేఫ్టీ పై యువతతో పాటు ప్రజల్లో మరింత అవగాహన కలిగించడానికి వరంగల్ కమిషనరేట్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. అవేకెన్ పేరుతో యువతను జాగృతం చేయడం కోసం, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన మోడల్స్ తో, పారా అథ్లెట్స్ తో చేసిన వినూత్న ప్రయత్నానికి ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభించింది.
డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల నివారణకు అవేకెన్ కార్యక్రమం
మత్తు పదార్థాలను పారదోలడమే లక్ష్యంగా, రోడ్డు ప్రమాదాల నివారణ ప్రాధాన్యతగా ముఖ్యంగా యువతలో మార్పు తీసుకొచ్చేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు అవేకెన్ పేరుతో ఓ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేఎంసీ మైదానంలో వాకెన్ వాక్ పేరిట సోమవారం రాత్రి నిర్వహించిన అవేకెన్ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. మంత్రి దయాకర్ రావు, సీపీ తరుణ్ జోషి, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు.
జాతీయ, అనతర్జాతీయ మోడల్స్ తో ర్యాంప్ వాక్
జాతీయ, అంతర్జాతీయ మోడల్స్ ర్యాంప్ వాక్ నిర్వహించి అక్కడికి వచ్చిన యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. డిజైనర్ రాం అగర్వాల్ రూపొందించిన విభిన్న దుస్తుల్లో మోడల్స్ నిర్వహించిన ఫ్యాషన్ షో అక్కడికి వచ్చిన వారందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదనే సందేశాన్ని కూడా యువతకు రీచ్ అయ్యేలా చేశారు. యువతను ఆలోచింపజేసేలా చేశారు.
డ్రగ్స్ కు యువత బానిసలు కావద్దన్న మంత్రి ఎర్రబెల్లి .. నో టు ది డ్రగ్స్ ప్రతిజ్ఞ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యార్థి, యువత డ్రగ్స్ కు బానిసలు కాకుండా ఉన్నతాశయంతో ఎదగాలని విజ్ఞప్తి చేశారు. మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగారావు, సీపీ తరుణ్ జోషి, నిట్ డైరెక్టర్ ఆచార్య రమ ణారావు, కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తదితరులు తమ సందేశాన్ని ఇచ్చారు. మత్తు పదార్థాలకు బానిసలైతే జరిగే నష్టాలను వివరించారు. విద్యార్థులతో సీపీ 'నో టు ది డ్రగ్స్' అంటూ ప్రతిజ్ఞ చేయించారు. యువత కూడా ఈ ప్రతిజ్ఞ చేయడంలో ఉత్సాహంగా పాల్గొంది.
జాతీయ క్రీడాకారులతో మత్తుపదార్దాలపై అవగాహన కల్పించే యత్నం
ఈ సందర్బంగా మత్తుపదార్థాలకు అలవాటుపడి జీవిత ఆశ యాలను కోల్పోయిన జాతీయ క్రీడాకారులతో కలిసి మత్తుపదార్థాలకు అలవాటు పడితే జరిగే నష్టాలను యువతకు వివరించే ప్రయత్నం చేశారు. నో టు ది డ్రగ్స్ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చివరగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారి నయూ కిరణ్ సెంటర్ అందించిన చిక్సిత, కౌన్సిలింగ్ తిరిగి సాధరణ స్థితి చెరుకున్న యువతకు వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమములో వరంగల్ ,హనుమకొండ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీహన్మంతు, గోపి, మున్సిపల్ కమీషనర్ ప్రావీణ్య తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.