ఈటల రాజేందర్ కు వరంగల్ పోలీసుల షాక్; పేపర్ల లీక్ కేసులో నోటీసులు
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఊహించని విధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పోలీసులు, ఈ కేసును సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా ఈ కేసులో నోటీసులు జారీ చేసి, వివరణ ఇవ్వాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు షాక్ ఇచ్చారు.
పదవ తరగతి పరీక్షలలో హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బిజెపికి అనుకూలంగా, బిజెపి పార్లమెంటరీ నమో టీం లో పనిచేస్తున్న ప్రశాంత్ ప్రశ్నాపత్రాలను వాట్సప్ గ్రూపులలో షేర్ చేశారని ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రశాంత్ ప్రశ్నపత్రాలను బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపారని, బండి సంజయ్ తో వాట్సాప్ చాటింగ్, వాట్సప్ కాల్స్ మాట్లాడారని పోలీసులు మొబైల్ లో దొరికిన ఆధారాలతో గుర్తించారు. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక సూత్రధారి బండి సంజయ్ అని అనుమానించిన పోలీసులు బండి సంజయ్ పై కేసు నమోదు చేసి, ఆయనను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించగా, బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు.

ఇక ఇదే కేసు పై దర్యాప్తును ముమ్మరం చేస్తున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడానికి హుజురాబాద్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ నుండి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఈటల రాజేందర్ కు ఏమైనా పాత్ర ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈటలకు కూడా ప్రశాంత్ ప్రశ్నాపత్రాన్ని పంపినట్లుగా ఆధారాలు ఉండడంతో, పదవ తరగతి పేపర్ లీక్ కేసులో ఈటల రాజేందర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఈటల స్టేట్మెంట్ ను వరంగల్ పోలీసులు రికార్డు చేయనున్నారని సమాచారం. మరి పోలీసుల నోటీసులకు ఈటల రాజేందర్ ఏం సమాధానం ఇస్తారో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications