మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.!బీజేపి వ్యతిరేక శక్తులతో కేసీఆర్ చర్చలు.!పల్లా సంచలన వ్యాఖ్యలు.!
హైదరాబాద్ : టిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి చూడలేక ప్రతి పక్ష నేతలు ప్రగతి నిరోధకుల్లా తయారయ్యారని రైతు బంధు సమితి అధ్యక్షుడు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండి పడ్డారు. తెలంగాణ అభివృద్ధి దేశం అంతా కనిపిస్తున్నా ఇక్కడి కళ్లులేని కబోదులైన ప్రతిపక్షాలకు మాత్రం కనిపించడం లేదని విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగు విస్తీర్ణం 51 శాతం పెరిగిందని, రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రైతుబంధు కింద 50వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో ప్రత్యక్షంగా వేసిన చరిత్ర సీఎం చంద్రశేఖర్ రావుదని పల్లా పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు చేయని కేంద్రం వద్దు. బీజేపి దిగిపోయేంత వరకు పోరాటం చేస్తామన్న పల్లా
2014లో 24మెట్రిక్ టన్నులు, 2020-21లో 141మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐ కి తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేసారు. 42లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని అన్నారు. బీజేపీ నాయకులను కళ్లాల దగ్గర రైతులు అడ్డుకుంటే గవర్నర్ ను కల్లాల సందర్శనకు బీజేపి నేతలు పంపారని అన్నారు పల్లా. గవర్నర్ ధాన్యం సేకరణ సెంటర్ ను సందర్శించి ప్రభుత్వం ధాన్యం సేకరణ బాగా జరుగుతుందని మెచ్చుకున్నారని అన్నారు. గత ఏడాది ఇదే సమయంలో గణాంకాలు చూసుకుంటే 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఎక్కువగా సేకరించిందని తెలిపారు.
బీజేపి వ్యతిరేక శక్తులతో మంతనాలు.. బీజేపిని తరిమికొట్టడమే లక్ష్యమన్న గులాబీ ఎమ్మెల్సీ
ఇవాళ్టి వరకు 5వేల 4వందల 47 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో ధాన్యం డబ్బులు వేశామని స్పష్టం చేసారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. అంతే కాకుండా కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ నిత్యం అబద్ధాలు చెప్తున్నారని, వచ్చే యాసంగిలో వరి వేయకుండా చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేసారు. బీజేపీ ప్రభుత్వం కూలిపోయే వరకు తాము పోరాటం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. వరి దాన్యాన్ని కొనుగోలు చేసే ఏ కేంద్ర ప్రభుత్వానికైనా తాము మద్దతు ఇస్తామని అన్నారు.
సమయం సందర్బం వచ్చినప్పుడు కేసీఆర్ చర్చలు.. బీజేపి పచ్చి అబద్దాల పార్టీ అన్న పల్లా
వ్యవసాయ అభివృద్ధిలో పెద్ద రాష్ట్రాలతో పోల్చుకున్నప్పటికీ, తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కూల్చే వరకు టీఆరెస్ పోరాటం కొనసాగుతుందని అన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం మాకు అవసరం లేదని స్పష్టం చేసారు పల్లా. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే ప్రభుత్వాలకే తమ మద్దతు ఉంటదని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాహసించే ఏ శక్తులతోనైనా కలిసి పనిచేసేందకు చంద్రశేఖర్ రావు సిద్దంగా ఉన్నారని తేల్చి చెప్పారు పల్లా.
ప్రతి నిర్ణయం ప్రజావ్యతిరేకమే.. కేంద్ర బీజేపి ప్రభుత్వం పై పల్లా ధ్వజం
బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎవరు ఫైట్ చేసినా వాళ్లకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తులతో చంద్రశేఖర్ రావు చర్చలు జరుపుతారని, అవసరం అనుకున్న సమయంలో అవసరం అయిన సందర్భంలో చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకుంటారని, రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వం తమకు అక్కర్లేదని కుండబద్దలు కొట్టారు. ఎల్ఐసీని ప్రయివేట్ పరం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నమన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.