బండి సంజయ్ నాయకత్వ మార్పుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సాగుతోంది భారతీయ జనతా పార్టీ. అయితే, ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరుగుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పూ ఉండదని చెప్పారు.

బండి సంజయ్ అధ్యక్ష మార్పుపై విజయశాంతి ఏమన్నారంటే?
'బీజేపీలో బండి సంజయ్ అధ్యక్ష మార్పు ఉండదు. తెలంగాణలో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళుతుందని నేను గతంలో ఎన్నోసార్లు తెలిపిన విషయాన్నే మా ముఖ్యనేతలు పదే పదే ధృవీకరిస్తున్నప్పటికీ... ఈ అంశంలో అయోమయం సృష్టించేందుకు, చివరికి మీడియాని కూడా తప్పుదారి పట్టించేందుకు నానా తంటాలు పడుతూ వస్తున్న ఇతర పార్టీల నాయకులను దృష్టిలో ఉంచుకుని, తాజా పరిణామం ద్వారా మరోసారి తెలియజేస్తున్నాను' అని విజయశాంతి ఓ ప్రకటనలో వెల్లడించారు.

బండికి ప్రధాని మోడీ ప్రశంసే ఇందుకు సంకేతమన్న విజయశాంతి
'కొద్ది రోజుల కిందటే మన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయమై మీడియా ద్వారా స్పష్టత ఇచ్చినప్పటికీ... తాజాగా ఒక మీడియా మిత్రుడు సంజయ్ అధ్యక్ష పదవి గురించి మా పార్టీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ని ప్రశ్నిస్తే ఆయన కూడా ఎంతో స్పష్టంగా మళ్లీ బదులిచ్చారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ.. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రశంసించడాన్ని లక్ష్మణ్ గుర్తు చేస్తూ ప్రధాని ఇచ్చిన కితాబే సంజయ్ కొనసాగింపునకు సంకేతమని తేల్చి చెప్పారు అని విజయశాంతి తెలిపారు.

బండి సంజయ్ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు.: విజయశాంతి
ఇక సందిగ్ధతలు బీజేపీలో ఎన్నడూ ఉండవు. కేసీఆర్ కుయుక్తుల ప్రచారాలు ఇక్కడ చెల్లవు. జాతీయవాదులు, హిందూ బంధువులు, మన బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక శివాజీ మహరాజ్ ప్రతిరూపపు ఆవేశంతో, నరేంద్ర మోడీ స్ఫూర్తితో బండి సంజయ్ అధ్యక్షతన రాబోయే ఎన్నికల రణక్షేత్రానికి ఇప్పటి నుంచే అనుక్షణం సైనికులై పనిచేసే సందర్భం ఆసన్నమైంది. అడుగడుగునా కలిసి నడుద్దాం... ప్రతి ప్రజా సమస్యపై పోరాడుదాం... బీజేపీ రాజ్యం తెలంగాణలో సాకారం చేద్దాం అని విజయశాంతి పిలుపునిచ్చారు.

కేసీఆర్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందన్న విజయశాంతి
జీవో నెంబర్ 317తో పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టి, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులైన భార్యభర్తలను ఒకరికొకరు కాకుండా చేస్తూ, వారి పిల్లలకు సైతం అన్యాయానికి గురి చేసిన కేసీఆర్ సర్కారుపై తిరుగుబాటు మొదలైంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మా స్థానికతను లాగేసుకోవడం మీకు తగునా?... అని పిల్లల్ని చంకనేసుకుని వచ్చిన తల్లిదండ్రులు ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నరు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధపడ్డరు. ఈ జీవోకి తగిన సవరణలు చెయ్యాలని లేదా రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల చోటు చేసుకున్న అర్థంపర్ధం లేని బదిలీల వల్ల ప్రతి రోజూ వందలాది కిలోమీటర్లు ప్రయాణం చెయ్యలేక ఆర్ధికంగా చితికిపోతూ ఆరోగ్యం కూడా పాడవుతోందని టీచర్లు నిరసిస్తూ, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ తీవ్ర వేదన చెందారు. అసలే ఆవేదనలో ఉన్న టీచర్లను పిల్లలతో సహా పోలీసులు స్టేషన్కి తరలించడం మరింత అమానుషం. ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఈ కేసీఆర్ జాతీయ స్థాయిలో ఇంకెలా వెలగబెడతారో చెప్పాల్సిన పని లేదని విజయశాంతి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications