మరింత తీవ్రంగా ఎండలు: తెలంగాణ జిల్లాలకు అలర్ట్, ప్రజలకు సూచనలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురియడంతో కొంత చల్లని వాతావరణం ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలు, వడగాలులతో మధ్యాహ్నంపూట బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజా మరో రెండ్రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండ తీవ్రత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత ఏడాది కంటే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం గమనార్హం.

బుధవారం రాష్ట్రంలో గరిష్టంగా ఆదిలాబాద్ లో 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కనిష్టంగా మెదక్లో 22.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మరోవైపు, గురు, శుక్రవారాల్లో కూడా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు ఎండ తీవ్రంగా ఉండే సమయాల్లో పూర్తిగా ఇళ్లలోనే ఉండాలని.. ఎక్కువగా నీరు తీసుకోవాలని సూచించారు. తేలికపాటి ఆహారాలు తీసుకోవాలని సూచించారు. బయటికి వెళ్లే ప్రజలు తమ పనులను ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications