చల్లబడిన హైదరాబాద్: మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు, వేడిగాలులు కూడా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల ప్రజలకు ఎండవేడిమి, ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించనుంది.
రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రానున్న నాలుగు రోజులపాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్మాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం తేలికపాటి ునంచి మోస్తరు వర్షం కురిసింది. బీఆర్కే భవన్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్ పేట, పంజాగుట్ట, బేగంబజార్, ఏంజె మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణ, లిబర్టీ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది.
నగరంలోని సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఈదురుగాలులు వీస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెహదీపట్నం, లంగర్ హౌస్, కార్వాన్, గోల్కొండ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్, బోలక్ పూర్, గాంధీనగర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో వర్షం పడింది.