తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ తాజాగా అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం, సోమవారంనాడు భారీ వర్షాలు కురవనున్న 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది. కాగా, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గింది.
జులై నెలలో లానినా ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పసిఫిక్లో ఎల్ నినో పరిస్థితులు పోయాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రియాశీలంగానే ఉన్నా.. దేశంలో వాటి విస్తరణ నెమ్మదించడంతో వర్షాలు కొన్ని ప్రాంతాల్లోనే పడుతున్నాయని తెలిపింది.

వారంపాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు.. మళ్లీ ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయని, అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో మధ్య భారతదేశంను దాటి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది. కాగా, శనివారం హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, ములుగు సహా మిగితా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వానలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో అతి భారీ వర్షం కురిసింది. ఉట్నూరులో 13.1 సెంటిమీటర్ల వర్షం పాతం నమోదైంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్ లో 4.7 సెంటిమీటర్లు, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెంటిమీటర్లు వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్లో భారీ వర్షం
ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.












Click it and Unblock the Notifications