disha case encounter:అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5.30 వరకు ఏం జరిగింది..?
దిశపై లైంగికదాడి జరిపి, హతమార్చిన నిందితులు నలుగురిపై శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జరిపారు. నిందితులు దిశను దహనం చేసిన చటాన్పల్లి వద్ద ఫైర్ ఓపెన్ చేశారు. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది. నిందితులకు బేడీలు లేవా..? వారు అక్కడున్న రాళ్లతో దాడిచేసే ప్రయత్నం చేశారా..? ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారా.. ఇంతకీ తెల్లవారుజామున చటాన్పల్లి వద్ద ఏం జరిగింది.
కస్టడీలో..
నలుగురు నిందితులను షాద్నగర్ కోర్టు పోలీసులకు ఏడురోజుల కస్టడీకి ఇచ్చింది. మహ్మద్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు చర్లపల్లి జైలులోనే తొలిరోజు గురువారం విచారించారు. కేసులో కీలకమైన సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం వారిని రాత్రి ఘటనాస్థలానికి తీసుకొచ్చారు. సాధారణ కేసుల్లో అయితే ఉదయమే తీసుకురావచ్చు. కానీ దిశను వీరు హింసించి చంపడంతో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. షాద్నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించే సమయంలోనే ప్రజాగ్రహం పెల్లుబికింది. దీంతో రాత్రి సమయంలోనే సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయాలని భావించారు.
Recommended Video
రహస్య ప్రాంతంలో..
నిందితులను కోర్టు కస్టడీకి అప్పగించడంతో వారిని రహస్య ప్రాంతంలో విచారించినట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. వారి నుంచి కీలక సమాచారాలు రాబట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రహస్య ప్రాంతం నుంచి ఘటనాస్థలానికి బయల్దేరారు. తొలుత తొండుపల్లి టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఎప్పుడు లారీ పెట్టారు, మద్యం ఎప్పటినుంచి తాగుతున్నారు ? దిశను ఎప్పుడు చూశారనే అంశాలపై విచారించారు. అక్కడ విచారణ ముగిసాక చటాన్పల్లి వద్దకు చేరుకున్నారు.
సీన్ రీ కన్స్ట్రక్షన్
దిశను నిందితులు కాల్చివేసిన ప్రాంతంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంతలో నిందితుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అక్కడున్న రాళ్లతో దాడులు చేశారు. పోలీసుల వద్ద నుంచి తుపాకీలు తీసుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. విధిలేని పరిస్థితుల్లో కాల్పులు జరిపామని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై కాల్పులు జరపడంతో కుప్పకూలిపోయారని పేర్కొన్నారు.
ఆధారాల సేకరణ
దిశ హత్య కేసులో క్లూస్ టీం కీలక ఆధారాలను సేకరించింది. సూపర్ లైట్ ఉపయోగించి విచారణలో కీ ఎవిడెన్స్ సేకరించింది. లారీ నుంచి రక్తపు మరకలు, తల వెంట్రుకలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పకడ్బందీగా చార్జీషీట్ దాఖలు చేయబోతున్న క్రమంలో.. నిందితులు పారిపోయేయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు.