భార్య టార్చర్ పెడితే ఎన్ని లక్షలు సంపాదించినా ఏం ఉపయోగం: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. తాను నివసిస్తోన్న అపార్ట్మెంట్ 14 అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన- స్థానికంగా కలకలం రేపింది. పలు అనుమానాలకు దారి తీసింది. ఆత్మహత్య వెనుక మానిసక వేధింపులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన సంభవించింది. హుజూర్నగర్ కు చెందిన శ్రీనివాసరావు ఐటీ ఉద్యోగి. ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. నల్లగండ్లలోని ఓ అపార్ట్మెంట్స్ లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోన్నారు. ఆస్తి విషయంలో కొంతకాలంగా భార్యతో శ్రీనివాసరావుకు గొడవలు జరుగుతుండేవని ఆయన తల్లి చెబుతున్నారు. ఈ వివాదం ముదరడంతో ఇరు కుటుంబాల పెద్దలు వచ్చి నచ్చజెప్పారు.

ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. అపార్ట్మెంట్ 14వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ నుండి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆయన తల్లి కమలమ్మ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు జ్యోతి కారణమని లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
తనతో పాటు శ్రీనివాసరావు పేరు మీద ఉండే ఆస్తులన్నింటినీ కూడా తన పేరు మీద బదలాయించాలని జ్యోతి.. రోజూ తన కుమారుడితో గొడవపడుతుండేదని, మానసికంగా వేధించేదని కమలమ్మ చెబుతున్నారు. దీన్ని భరించలేక శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారనేది ఆమె వాదన. ఈ ఉదంతం మానసిక ఆరోగ్య సంక్షోభం వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినట్టయింది.
భార్య, ఇద్దరు పిల్లలతో, చీకూ చింతా లేెకుండా జీవితం గడుపుతున్న వ్యక్తి కూడా మానసిక ఒత్తిళ్లకు తలవంచి, ఏకంగా బలవన్మరణానికి పాల్పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ వ్యక్తి అంత అందమైన జీవితాన్ని వదులుకుని చావును ఎందుకు కోరుకుంటాడనే వాదనలను తెరమీదికీ తీసుకొచ్చింది. ఓ నిండు కుటుంబం ఉన్నప్పటికీ.. వేధింపులు ఏకంగా ప్రాణం తీసుకునేంతగా ప్రభావితం చేయడం ఆయన మానసిక వేదను అద్దం పట్టినట్టయింది.












Click it and Unblock the Notifications