మహిళామంత్రులు ఇంటికెళ్ళి పిలిచినా మేడారం జాతర వంక చూడని కేసీఆర్!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, గిరిజన కుంభమేళాగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు విశేషంగా తరలివెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తులతోపాటు, మేడారం జాతరలో వీవీఐపీలు, వీఐపీల తాకిడి బాగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులతోపాటు, కేంద్రమంత్రులు సైతం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
మేడారం జాతరకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు
కేంద్ర మంత్రులు జుయల్ ఓరం, కిషన్ రెడ్డి మేడారం జాతరలో నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలంగాణ రాష్ట్రంలోని డిజిపితో సహా ఉన్నతాధికారులు అందరూ మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు.

కేసీఆర్ ను జాతరకు ఆహ్వానించిన మహిళా మంత్రులు
ప్రస్తుతం పదేళ్లు సీఎం గా ఉన్న కేసీఆర్, గతంలో మేడారం జాతరను ఘనంగా నిర్వహించిన కెసిఆర్ మేడారం జాతరకు రాకపోవడం పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది.గతంలో ఎన్నడు లేని విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ఆహ్వానించడానికి మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇద్దరు సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ తమ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.
జాతర వంక చూడని కేసీఆర్, కేటీఆర్ లు
అంతేకాదు మేడారం జాతరకు ఆహ్వానించిన వారికి పసుపు, కుంకుమ, వస్త్రాలు అందజేసి పంపించారు కెసిఆర్. కెసిఆర్ సానుకూలంగా స్పందించిన తర్వాత మేడారం జాతరకు ఆయన వస్తారని చాలామంది భావించారు. కానీ కెసిఆర్ మేడారం జాతర వంక కూడా చూడలేదు. కనీసం తమవంతుగా తమ కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా పంపలేదు.
జాతరకు పిలిచి సిట్ నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఫైర్
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ చేస్తుంటే, బీఆర్ఎస్ నేతలు ఒకపక్క మేడారం జాతరకు రమ్మని ఆహ్వానించి, మరోవైపు ఫోన్ టాపింగ్ కేసులో కెసిఆర్ కు సిట్ నోటీసులు పంపించారని విమర్శిస్తున్నారు. కెసిఆర్ మేడారం జాతరకు వెళ్లకుండా, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన క్రమంలో, ఎన్నికలపైన ఫోకస్ చేయకుండా ఉండడం కోసమే ఈ తరహా రాజకీయాలు ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ నుండి ఎర్రబెల్లి, సత్యవతి తదితరులు
అన్ని పార్టీల నుంచి కీలక నాయకులు మేడారం జాతరకు వచ్చి వెళుతున్న క్రమంలో, బీఆర్ఎస్ పార్టీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ వెళ్ళారు తప్ప ముఖ్య నాయకులుగా భావించే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ హాజరు కాలేదు.
కవిత రావటంతో కేసీఆర్ ఫ్యామిలీపై చర్చ
మేడారం జాతరకు కవిత హాజరై, తెలంగాణలో జరిగే కుంభమేళాకు తన వంతుగా గౌరవాన్ని ప్రదర్శించారు. పదేళ్లు పాలనలో ఉన్నప్పుడు రెండేళ్లకోసారి మేడారం జాతరను ఘనంగా నిర్వహించిన కేసీఆర్, అధికారంలో లేకపోయేసరికి జాతర వంక కన్నెత్తి కూడా చూడలేదు అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది.












Click it and Unblock the Notifications