హైదరాబాదీల్లో వ్యతిరేకత: ఎర్రబెల్లి, కేసీఆర్కు ట్యాపింగ్ చిక్కు, నిలదీత
హైదరాబాద్: ప్రపంచమంతా యోగా చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం సినిమా ఫంక్షన్కు వెళ్లారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం ఎద్దేవా చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే కేసీఆర్ హడావుడి చేస్తున్నారన్నారు. కేసీఆర్ మాటలకు, హామీలకు అధికారులే నవ్వుకుంటున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం పైన హైదరాబాదీల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు.
ఆపరేషన్ బ్లూస్టార్లో భాగంగానే రేవంత్ రెడ్డి పైన అక్రమంగా కేసులు పెట్టారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ కరీంనగర్లో ఆరోపించారు. వెయ్యిమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం స్పందించకపోడం దారుణమన్నారు. ఏడాదికాలంగా తెలంగాణ వచ్చినా నిధులు లేవని, నియామకాలు లేవన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేదన్నారు. భోజానికి పిలిచి ప్రసాదం పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ లాగానే ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు. పక్కా ప్రణాళికతో రేవంత్ను ఇరికించారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పైన కేసీఆర్ స్పందించడం లేదని నిలదీశారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్కు చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. ట్యాపింగ్ పైన స్పందించడం లేదేమని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నించింది.