ఎందుకింత జాప్యం.. క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేదు?: 'నేరెళ్ల 'పై హైకోర్టు సీరియస్
నేరెళ్ల దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో ఇంతవరకు ఎందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయలేకపోయారని హైకోర్టు డీజీపీని ప్రశ్నించింది.
హైదరాబాద్: నేరెళ్ల దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో ఇంతవరకు ఎందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయలేకపోయారని హైకోర్టు డీజీపీని ప్రశ్నించింది. కేసు విచారణకు సంబంధించి ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీసింది.
నేరెళ్ల దళితులపై దాడి ఘటనను సీబీఐతో విచారణ జరపించాలని కోరుతూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ గంగారావులతో కూడిన బెంచ్ డీజీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సంఘటనపై సంజీవ్ వివరణ:
సంఘటన గురించి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ న్యాయస్థానానికి వివరించారు. చర్యల విషయంలో అతిగా వ్యవహరించినందుకు ఎస్ఐపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇసుక లారీ గుద్ది ఓ వ్యక్తి చనిపోవడంతో.. గ్రామంలోని పలువురు యువకులు ఆగ్రహంతో ఇసుక లారీలను తగలబెట్టారని చెప్పారు.
పిటిషన్ తరుపు న్యాయవాది రఘునాథ్ స్పందిస్తూ.. లారీలను తగలబెట్టిన తర్వాత పోలీసులు వారిని పట్టుకొచ్చి చిత్రహింసలకు గురిచేశారని, అందులో నలుగురు దళితులు ఉన్నారని తెలిపారు.
ఎందుకింత జాప్యం జరిగింది?
ఎస్ఐపై కేసుకు సంబంధించి న్యాయస్థానం వివరాలు కోరింది. ఏ రోజు ఎస్ఐపై కేసు నమోదు చేశారో.. ఏయే సెక్షన్లు నమోదు చేశారో చెప్పాలని కోరింది. దీనిపై స్పందించిన న్యాయవాది సంజీవ్.. అక్టోబర్ 6న ఐపీసీ సెక్షన్-324కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
సంఘటన జరిగింది అక్టోబర్ 1న అయితే కేసు ఫైల్ చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు అయిందని కోర్టు ప్రశ్నించింది. అలాగే కేసులో ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని ఎందుకు చేర్చలేదని నిలదీసింది.
నేరెళ్ల ఇసుక కథ: కెసిఆర్ ఎదురు ప్రశ్నే తప్ప....
సమగ్ర వివరాలు వెల్లడించాలని:
అగస్టు 9న డీజీపీ విచారణకు ఆదేశించారని, అగస్టు 10న ఎస్ఐపై వేటు పడిందని సంజీవ్ తెలిపారు. కాగా, కోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఎస్ఐ, ఎస్పీలు తమ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. న్యాయస్థానానికి సమగ్ర వివరాలు వెల్లడించాలని కేసును విచారిస్తున్న హైకోర్టు బెంచ్ వారికి స్పష్టం చేసింది.
రిటైర్డ్ న్యాయమూర్తి 'పిల్'
నేరెళ్ల ఘటనకు సంబంధించి రిటైర్డ్ న్యాయమూర్తి బి.చంద్రకుమార్ రాసిన లేఖను న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదికి గుర్తుచేసింది. నేరెళ్ల బాధితులతో స్వయంగా మాట్లాడి చంద్రకుమార్ రాసిన ఆ లేఖను 'పిల్'గా మారుస్తున్నట్లు తెలిపింది. దానికి కౌంటర్ దాఖలు చేయవచ్చునని పేర్కొంది.