వివాహేతర సంబంధం: తనికెళ్ల భరణి సాక్షిగా త్యాగరాయ గానసభలో ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో కలకలం రేగింది. ప్రముఖ రచయిత్రి రాజేశ్వరీ చంద్రజ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం కాస్త తన్నులాటతో రసాభాసగా ముగిసింది. 'పూజకు వేళాయేరా', 'మనసు పడిన కథలు' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వివాహేతర సంబంధాలు బయటపడ్డాయి.
చిట్యాలకు చెందిన అంజనా ఎక్సప్లోజివ్స్ కంపెనీ యజమాని దొమ్మేటి వెంకటస్వామికి సూర్యప్రభ అనే మహిళతో 1991లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే సూర్యప్రభకు విడాకులు ఇవ్వని వెంకటస్వామి, రచయిత్రి రాజేశ్వరి చంద్రజతో సంసారం చేస్తున్నాడని సూర్యప్రభ ప్రధాన ఆరోపణ.
దీనికి సంబంధించిన వివరాలను ఈ పుస్తకావిష్కరణకు హాజరైన అతిథులకు అందజేస్తుండగా వెంకటస్వామి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో రచయిత్రి రాజేశ్వరి చంద్రజతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త వెంకటస్వామిని భార్య సూర్యప్రభ చితకబాదారు.
ఇంతలో సూర్యప్రభ బంధువులు రంగప్రవేశం చేసి, తలో చేయి వేసి ఆయనకు దేహశుద్ధి చేశారు. ఈ గొడవంతా కూడా పూజకు వేళాయెరా అనే పుస్తకం గురించి మాట్లాడుతున్న సమయంలో వేదికపై చోటు చేసుకోవడం విశేషం. అప్పటి వరకు పక్కనే నిలబడి ఉన్న సూర్యప్రభ ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చి భర్తకు చితకబాదడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
ఈ తోపులాటలో వెంకట స్వామి ఒక్కసారిగా కిందపడిపోయారు. అప్పటి వరకు సాహితీవేత్తల ప్రసంగాలతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం కాస్త అరుపులు, కేకలతో హడలిపోయారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి హాజరై పుస్తకాలను ఆవిష్కరించారు.