వారి ఇళ్లు మాత్రమే కూల్చుతారా? హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
చెరువులు, ప్రభుత్వ భూములను అక్రమార్కుల బారినుంచి కాపాడేందుకు ఏర్పాటైన హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల ఇళ్లే కాకుండా పెద్దలవి కూడా కూల్చాలని హైకోర్టు స్పష్టం చేసింది. పెద్దల భవనాలను కూల్చినప్పుడే ప్రభుత్వ భూములను రక్షించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది.
మీరాలం ట్యాంక్ పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం.. దుర్గుం చెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది.

హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రమేనా?.. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఏదైనా ఉందా? అని నిలదీసింది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొందరిపైన మాత్రమే ఎందుకు వర్తిస్తున్నాయి? అని హైకోర్టు ప్రశ్నించింది. మియాపూర్, దుర్గం చెరువు పరిసరాల్లో అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏమిటో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.
ఈ ప్రాంతాల్లో ఎంతమంది అక్రమంగా స్థలాలు ఆక్రమించుకున్నారు? ఏయే నిర్మాణాలు అనుమతులు లేకుండా నిర్మించబడ్డాయి? అనే అంశాలను తేల్చాని హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. ప్రబల వర్గాలు, అధికార పరిధిలో ఉన్నవారికి హైడ్రా ఏమాత్రం నష్టం కలగకుండా ఉంటే.. సామాన్య ప్రజలపై మాత్రం కఠినంగా వ్యవహరించడమేంటని ప్రశ్నించింది.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా పనితీరును సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. మీరాలం చెరువు పరిసరాల్లో ఆక్రమణలపై స్పష్టత కోసం ఉమ్మడి సర్వే చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
చెరువుల పరిరక్షణ మంచి విషయమే అయినా.. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని స్పష్టం చేసింది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా అనే మహిళ కోర్టును ఆశ్రయించగా.. విచారణ సందర్భంగా హైడ్రాపై హైకోర్టు ఈ మేరకు తీవ్రంగా స్పందించింది.












Click it and Unblock the Notifications