భార్యతో ఫ్రెండ్ పేరుతో అశ్లీల చాటింగ్ , వీడియోలు పంపి..కోటి కొట్టేసిన ఘనుడీ మొగుడు
మోసపోయేవాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు. అయితే అలాంటి మోసం బయట వాళ్ళనే కాదు, సొంత వాళ్లను చేస్తున్న ఘనులు మన తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉన్నారు. ఇక అసలు విషయానికొస్తే ఒక భర్త భార్యని మోసం చేసి దాదాపు కోటి రూపాయలు కొట్టేశాడు అంటే అతని తెలివితేటలు ఏపాటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక భార్య దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి భర్త ఎంచుకున్న చండాలమైన మార్గాన్ని చూస్తే ఖచ్చితంగా అవాక్కు అవ్వాల్సిందే.
మొబైల్ లో అసభ్యసందేశాలు పంపి బెదిరింపులు... ఫిర్యాదు చేసిన మహిళకు షాక్
ఇక అసలు విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ గచ్చిబౌలి లో భార్య తన భర్త తన వద్ద నుండి కోటి రూపాయలు కొట్టేశాడు అని, తనకు స్నేహితుడు పేరుతో అసభ్యమైన సందేశాలు పంపి, వీడియోలు పంపి బెదిరించాడని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి కి చెందిన ఒక మహిళకు కరీంనగర్లో ఉంటున్న సంతోష్ కుమార్ కి మాట్రిమోనియల్ సైటు ద్వారా పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త పెళ్లి దాకా వెళ్ళింది.ఇరు కుటుంబాల పెద్దలు ఒకే కులం కావడంతో పెళ్లికి అంగీకరించి ఆ శుభకార్యం కాస్త కానిచ్చేశారు.
అమెరికాలో ఉన్న భార్య వద్ద నుండి డబ్బు కోసం ప్లాన్ వేసిన భర్త
పెద్దల సమక్షంలో జరిగిన వివాహానికి సంతోష్ కుమార్ కి కట్నకానుకలు కూడా భారీగానే ముట్ట చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా వివాహం తర్వాత సంతోష్ కుమార్ భార్య ఉద్యోగ రీత్యా అమెరికాకి వెళ్ళింది.ఇక్కడే ఉంటున్న భర్త సంతోష్ కుమార్ తనకు ఏవేవో అవసరాలు ఉన్నాయని చెబుతూ భార్య వద్దనుండి ఇప్పటివరకు 63 లక్షల రూపాయలు తీసుకున్నాడు. నిత్యం డబ్బులకు ఆమెను అడగడానికి ఇబ్బందిగా ఫీల్ అయిన సంతోష్ కుమార్, పెళ్ళాం దగ్గర్నుండి పైసల కోసం మరో కొత్త ప్లాన్ వేసాడు.
అనుమానంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
సంతోష్ కుమార్ తన స్నేహితుడైన సత్యహర్షా రెడ్డి అనే పేరుతో భార్య మొబైల్ కు చాట్ చేయడం మొదలు పెట్టాడు. నిదానంగా భార్యను ట్రాప్ చేసిన సంతోష్ ఆమెతో మాట్లాడిన అశ్లీల చాట్ లు,వీడియోలు,ఫోటోలు ఆమెకి పంపి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇక భార్య వద్ద నుండి దాదాపు కోటి రూపాయల దాకా సంతోష్ వసూలు చేశాడు.అయితే ఈ వ్యవహారంలో తన భర్తపై అనుమానం వచ్చిన సదరు మహిళ గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసింది.
Recommended Video
భర్తే స్నేహితుడి పేరుతో ఇదంతా చేశారని తెలిసి షాక్ ..
ఇక ఈ కేసులో దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు భర్త సంతోష్ కుమార్ నే సత్య హర్ష రెడ్డి పేరుతో ఆమెతో చాట్ చేసినట్లుగా, అసభ్యకర సందేశాలు పంపినట్లుగా తేల్చారు. దీంతో పోలీసులు భార్యను వేధింపులకు గురి చేసిన భర్త సంతోష్ కుమార్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు. ఇక భార్యను స్నేహితుడు పేరుతో మోసం చేసి, అశ్లీల చాట్ లతో వేధింపులకు గురిచేసిన సంతోష్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం సంతోష్ కుమార్ చేసిన చండాలపు పనికి కటకటాలు లెక్కించాల్సి వస్తోంది.