పెళ్లయి రెండు నెలలే: భర్త మందలింపుతో యాసిడ్ తాగిన భార్య
హైదరాబాద్: అతి చిన్న విషయానికి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎక్కువ సేపు సెల్ ఫోన్లో మాట్లాడవద్దంటూ భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాదులోని మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన చెందిన ప్రభావతికి, రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట నగర పంచాయతీ పరిధిలోని గుర్రంగూడకు చెందిన పుట్టగళ్ల జనార్దన్కు రెండు నెలల కిందటే వివాహమైంది. అయితే ప్రభావతి పదే పదే ఫోన్లో మాట్లాడుతుందని భర్త ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు.

ఇదిలావుంటే, మూడు రోజుల కిందట ప్రభావతి తల్లిదండ్రులు గుర్రంగూడకు వచ్చారు. వారి ముందు కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. తీవ్ర ఉద్వేగానికి లోనైన ప్రభావతి తల్లిదండ్రుల ముందే మరుగుదొడ్డి శుభ్రపరిచే యాసిడ్ తాగింది.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం రాత్రి మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications