తల్లి వేధింపులకు కూతురు బలి: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
సిరిసిల్ల: భార్యాభర్తల మధ్య గొడవలు... కట్నంగా ఇచ్చిన డబ్బు విషయంలో తల్లీ, బిడ్డల మధ్య ఘర్షణ. కూతురిని కట్టుకున్న భర్త కాదనడంతో అండగా నిలవాల్సిన తల్లి అల్లుడుకి మద్దతుగా నిలిచింది. దీంతో పోలీసులు న్యాయం చేయడం లేదని ఆవేదనతో కరీంగనగర్ జిల్లా సిరిసిల్ల గ్రామీణ రూరల్ పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన హారిక(24)కు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్కు చెందిన సుదర్శన్తో ప్రేమ వివాహమైంది. పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచి సుదర్శన్తో పాటు అతని తల్లి ఆడబిడ్డలు అదనపు కట్నం రూ.2 లక్షలు తేవాలంటూ వేధించసాగారు.
అత్తింటి వేధింపులు భరించలేక ఈనెల 8న తల్లి తారకు ఫోన్చేస్తే పట్టించుకోకుండా కూతురిని మందలించింది. అదేరోజు రాత్రి నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి వచ్చి సిరిసిల్ల మండలం చీర్లవంచలోని అమ్మమ్మకు ఫోన్చేయగా ఆమె వెళ్లి హారికను తీసుకొచ్చింది.

అనంతరం హారిక అత్తింటి వేధింపులపై సిరిసిల్ల గ్రామీణ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పెద్దల మధ్య పరిష్కరించుకోమని చెప్పారు. డిసెంబర్ 12 న పంచాయితీ పెట్టి పెద్దలు విడాకులు తీసుకోవాలని, హారికకు పరిహారం కింద రూ.2.60 లక్షలు, ఏడు తులాల బంగారం ఫిబ్రవరి 2 న సుదర్శన్ ఇవ్వాలని నిర్ణయించారు.
విషయం తెలుసుకున్న హారిక తల్లి తార ఆదివారం ఆ డబ్బులు తనకే ఇవ్వాలంటూ సిరిసిల్ల రూరల్ సీఐకి ఫిర్యాదు చేసింది. తన భార్యతోపాటు అత్త సంతకం పెడితేనే డబ్బులు ఇస్తానంటూ సుదర్శన్ మెలికపెట్టాడు. ఈ క్రమంలో తన మనవరాలికి డబ్బులు ఇప్పించాలంటూ వెంకటమ్మ హారికను తీసుకుని ఆదివారం సీఐ వద్దకు వచ్చింది.
సీఐ లేకపోవడంతో సిబ్బందిని ఆశ్రయించగా వారు హారిక తల్లికి ఫోన్ చేసి రావాలని సూచించారు. తార అక్కడికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన హారిక పురుగుల మందు తాగింది. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న తల్లి తార ఆసుపత్రికి రాగా బంధువులు ఆమెపై దాడి చేసి చితకబాదారు.
అకారణంగా కన్న కూతురినే పొట్టనపెట్టుకున్నావంటూ నిందించారు. పెద్దల తీర్పు, విడాకులకు వచ్చిన డబ్బులు ఇవ్వకుండా తల్లి తార అడ్డుకోవడం, పోలీసులు దుర్భాషలాడటంతో హారిక ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరి రేవతి ఆరోపించారు. తల్లితో జరిగిన వివాదంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసుల నిర్లక్ష్యమేమీ లేదని సీఐ తెలిపారు.
మృతురాలి అమ్మమ్మ వెంకటమ్మ ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications