ఐదో అంతస్థు నుంచి పడి మహిళ మృతి: భర్తపై అనుమానాలు
హైదరాబాద్: హైదరాబాదులోని కూకట్పల్లిలో లాడ్లీ ముదిరాజ్ అనే 24 ఏళ్ల వివాహిత అపార్టుమెంటుపై నుంచి పడి మరణించింది. కూకట్పల్లిలోని శ్రీనిధి గార్డెన్స్లో సాయి ముదిరాజ్, అతని భార్య లాడ్లీ ఉంటున్నారు.
శుక్రవారం తెల్లవారు జామున అపార్టుమెంట్ ఐదో అంతస్థు నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే గుర్తించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
సమాచారం ఇచ్చిన భర్త...
లాడ్లీ భర్త సాయి ముదిరాజ్ ఆమె మరణించిన విషయాన్ని లాడ్లీ తండ్రి రాజేష్ భండారీకి సమాచారం అందించాడు. అయితే తన కూతురు మరణానికి సాయి ముదిరాజ్, అతని కుటుంబ సభ్యులే కారణమని లాడ్లీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేను కారణం కాదు...
లాడ్లీ మృతికి తాను కారణం కాదని, ఆడుకుంటూ ఆడుకుంటూ తమ పెంపుడు కుక్క అకస్మాత్తుగ మీద పడడంతో లాడ్లీ కింద పడిపోయిందని సాయి ముదిరాజ్ చెబుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వారిది ప్రేమ వివాహం...
ప్రస్తుతం సాయి ప్రసాద్ ఓ ప్రైవేట్ సంస్థలో టెలికాలర్గా పనిచేస్తుండగా, లాడ్లీ అమెజాన్లో పనిచేస్తోంది. సాయి ప్రసాద్ నగరంలోని సోమాజిగుడాలో ఉండే రాజేష్ భండారీ కూతురు లాడ్లీ ముదిరాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సాయి ప్రసాద్, అతని సోదరి సుధారాణి, లాడ్లీ కలిసి భవనం ఐదో అంతస్తుకు పంపుడు కుక్కతో చేరుకున్నారు.
రెయిలింగ్పై కూర్చునేందుకు లాడ్లీ...
ఆ సమయంలో లాడ్లీ భవనం రెయిలింగ్పై కూర్చునేందుకు ప్రయత్నించిందని, ఆ స్థితిలో పెంపుడు కుక్క పరుగున ఆమె వద్దకు చేరుకుందని, ఆ క్రమంలోనే ఆమె భవనంపై నుంచి పడిపోయిందని సాయి ప్రసాద్, సుధారాణి చెబుతున్నారు.
చలిలో అక్కడికి ఎందుకు వెళ్తారు..
అల్లుడే తన కూతురి మరణానికి కారణమని రాజేష్ భండారీ ఆరోపించారు. అంత చలిలో అక్కడికి ఎందుకు వెళ్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిందితుడు సాయి ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.