వివాహేతర సంబంధం: ప్రియుడితో భర్తను చంపించిన భార్య
హైదరాబాద్: భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను బలి తీసుకుంది. ఆదివారం సాయంత్రం మల్లాపూర్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంజనీరింగ్ సంస్ధ సూపర్వైజర్ కృష్ణ (30)ను గొంతుకోసి అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ఆసక్తికర సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
మెదక్ జిల్లా రామాయం పేటకు చెందిన భాగ్యలక్ష్మీతో జప్తి శివనూద్ గ్రామానికి చెందిన నర్సయ్య కుమారుడు కాబోజు కృష్ణకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లికి ముందే భాగ్యలక్ష్మీ రామాయం పేటకు చెందిన తన స్నేహితుడు రాజశేఖర్ అనే యువకుడిని ప్రేమించింది.
తల్లిదండ్రుల ఒత్తిడితో భాగ్యలక్ష్మీ కృష్ణను వివాహం చేసుకుంది. కృష్ణతో వివాహం ఇష్టం లేని భాగ్యలక్ష్మీ ఇంటి నుంచి పారిపోయి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి ప్రియుడు రాజశేఖర్ నిరాకరించడంతో తిరిగి భర్త వద్దకే వచ్చింది. భార్య వివాహేతర సంబంధాన్ని గుర్తించిన భర్త, భాగ్యలక్ష్మీని తీసుకుని ముంబై వెళ్లాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఆ తర్వాత కొంతకాలానికి జీవనోపాధి కోసం మల్లాపూర్కు వచ్చి స్ధిరపడ్డారు. మల్లాపూర్లో ఓ ఇంజనీరింగ్ సంస్ధలో సూపర్వైజర్గా చేరాడు. తన భార్య కోసం ఇంటి వద్దనే ఓ గాజుల దుకాణాన్ని తెరిచాడు. మల్లాపూర్కు వచ్చిన తర్వాత భాగ్యలక్ష్మీ తన ప్రియుడితో సంబంధాలు కొనసాగించడం మొదలు పెట్టింది.
ఈ విషయం తెలుసుకున్న కృష్ణ భార్య భాగ్యలక్ష్మీతో తరచూ గొడపడతూ ఉండేవాడు. ఈ విషయాన్ని భాగ్యలక్ష్మీ తన ప్రియుడు రాజశేఖర్కు చెప్పింది. ఆదివారం సాయంత్రం భాగ్యలక్ష్మీ కూరగాయల కోసం కుమార్తెను తీసుకొని వెళ్లింది. ఈ సమయంలో కృష్ణ పనిచేసే ఇంజనీరింగ్ సంస్ధలో కుమారుడితో ఉన్నాడు. భాగ్యలక్ష్మీ ప్రియుడు రాజశేఖర్ ఆటోలో మల్లాపూర్కు వచ్చాడు.
దుకాణంలో ఉన్న కృష్ణతో కావాలనే గొడవ పెట్టుకున్నాడు. వెంటనే తన చేతిలో ఉన్న కత్తి తీసుకుని కృష్ణ భుజం, మర్మాయవాల ప్రాంతాల్లో పొడిచి పరారయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన స్ధానికులు ఆటో నెంబర్ను రాసుకొని పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాగ్యలక్ష్మీని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడు రాజశేఖర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.