కరీంనగర్లో మహిళ దారుణ హత్య, నకిలీ డాక్యుమెంట్లతో భూముల విక్రయం
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. సురేందర్, భాగ్యలక్ష్మీ(44) దంపతులు స్థానిక పాత టెలిఫోన్ ఎక్స్చేంజి సమీపంలో నివాసం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు కూతుళ్లు. సురేందర్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. బుధవారం ఉదయం సురేందర్ ఆఫీసుకు వెళ్లగా, ఇద్దరు పిల్లలు స్కూలుకు వెళ్లగా భాగ్యలక్ష్మీ ఒక్కతే ఇంట్లో ఉంది. అదే ఇంట్లో కింది పోర్షన్లో అద్దెకు ఉండే మహిళ భాగ్యలక్ష్మీ కోసం మధ్యాహ్నం పై అంతస్తులోకి వెళ్లింది.
ఇంటిలోని హాలులో భాగ్యలక్ష్మీ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన ఆమె వెంటనే చుట్టుపక్కల వారికి విషయాన్ని చెప్పింది. వెంటనే భాగ్యలక్ష్మీ భర్త సురేందర్తో పాటు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని గొలుసు తెంచుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
నకిలీ డాక్యుమెంట్లతో భూముల విక్రయం
మెదక్ జిల్లాలో నకిలీ డాక్యుమెంట్లతో భూములు విక్రయిస్తున్న ముఠాను రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేశారు. రూ. కోటి విలువ చేసే 9 స్థలాలు అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్టు చేయగా.. నకిలీ డాక్యుమెంట్ల తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బేగంపేటలో చైన్ స్నాచింగ్
నగరంలో మరోసారి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. బాలంరాయి చౌరస్తా వద్ద నడిచి వెళ్తున్న మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును బైక్పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.