ప్రేమ పేరుతో దగ్గరై... మోసాన్ని తట్టుకోలేకపోయిన టెక్కీ... రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య...
ప్రేమ పేరుతో మోసం... ఆపై సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేసి వేధింపులు... తట్టుకోలేకపోయిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్కేసర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులోని మేడిపల్లికి చెందిన శ్వేత నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం లాలాపేటకు చెందిన అజయ్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అజయ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు మరింత దగ్గరయ్యారు. కొన్నేళ్లు ప్రేమ వ్యవహారం సాఫీగానే సాగింది.
కానీ శ్వేతను వదిలించుకోవాలనే ఉద్దేశంతో కొద్ది నెలలుగా అజయ్ ఆమెను వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో ఆమె తనతో సన్నిహితంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వేధింపులకు గురిచేశాడు. ఫోటోలు తొలగించమని కోరితే బ్లాక్మెయిల్ చేశాడు. ప్రేమించినవాడే ఇలా తనను మోసం చేయడంతో శ్వేత కుమిలిపోయింది. కొన్నాళ్లు భరించినప్పటికీ... ఇక తట్టుకోలేక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అజయ్ని పిలిపించి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు.
అయినప్పటికీ అజయ్ తీరులో మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్వేత సెప్టెంబర్ 18న బలవన్మరణానికి పాల్పడింది. ఘట్కేసర్ రైల్వే ట్రాక్పై ఓ రైలుకు ఎదురెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియక సెప్టెంబర్ 19న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో శ్వేత ప్రియుడు అజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. తమ కుమార్తె చనిపోయిందన్న విషయం తెలిసి శ్వేత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె చావుకు కారణమైన అజయ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.