మంత్రి హరీశ్ సభలో మహిళ ఆత్మహత్యా యత్నం, సర్పంచ్ను చెప్పుతో కొట్టిన టీఆర్ఎస్ నేత
హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సభలో కలకలం రేగింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ మంత్రి హరీశ్రావు పాల్గొన్న బహిరంగసభలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మార్కెట్ యార్డులో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.
మార్కెట్ యార్డులోని సభలో మంత్రి హరీశ్ రావు ప్రసంగిస్తుండగా, అ సమయంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వరలక్ష్మి తాండూర్ జడ్పీటీసీ తన భూమి ఆక్రమించాడని, పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదని మంత్రి ఎదుటే పురుగుల మందు తాగింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు ఆమెను చికిత్స కోసం ఆమెను సమీపంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
సర్పంచ్ను చెప్పుతో కొట్టిన టీఆర్ఎస్ నేత
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని టీఆర్ఎస్ లీడర్ ఒకరు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మఠంపల్లి మండలం అల్లీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పిచ్చిరెడ్డిని ఆ గ్రామ టీఆర్ఎస్ లీడర్ గోలి రవి శుక్రవారం చెప్పుతో కొట్టాడు.
దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. ఈ సంఘటన మఠంపల్లి మండల కార్యాలయంలో చోటుచేసుకుంది. కాగా టీఆర్ఎస్ నేత తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.