న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడంపై భర్తతో గొడవ, టెక్కీ మృతి
కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే విషయమై భర్తతో గొడవపడిన ఓ వివాహిత మనస్తాపం చెంది ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకల గొడవ ఓ ఇంట్లో విషాదం నింపింది. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే విషయమై భర్తతో గొడవపడిన ఓ వివాహిత మనస్తాపం చెంది ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషాదకర సంఘటన శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. మదనపల్లెలోని ప్రశాంతనగర్కు చెందిన బాషాకు మూడేళ్ల కిందట హైదరాబాద్కు చెందిన రమీజాబీ(27)తో వివాహం జరిగింది. వీరికి పద్నాలుగు నెలల కొడుకు ఉన్నాడు.
భార్యాభర్తలు బెంగళూరులో నివాసముంటూ సాఫ్టువేర్ ఇంజినీర్లుగా ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వారం రోజుల కిందట భార్యాభర్తలు హైదరాబాద్కు వచ్చారు. కొత్త సంవత్సర వేడుకలను హైదరాబాదులోనే జరుపుకోవాలని రమీజాబీ అనడంతో అందుకు బాషా ఒప్పుకోలేదు. బెంగళూరు లేదా మదనపల్లెలో జరుపుకుందామని, ఇక్కడ వద్దని చెప్పాడు.
దానికి ఆమె ససేమీరా చెప్పింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం మదనపల్లెకు చేరుకున్నారు. అయితే, శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో మరోసారి గొడవపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన రమీజాబీ ఇంట్లో అందరూ నిద్రపోయాక ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.