ప్రపంచ ఝూటా అవార్డు కేసీఆర్కే.. బీజేపీని తలవనిదే సీఎంకు నిద్ర పట్టదు: డీకే అరుణ
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మండిపడ్డారు. బిజెపి పేరు తలవకుండా కేసీఆర్ కు నిద్ర కూడా పట్టని పరిస్థితి ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ అంటేనే అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గొంతు చించుకుంటున్నారు అంటూ డీకే అరుణ పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆమె మండిపడ్డారు.
ప్రపంచ ఝూటా అవార్డు ఉంటే దానిని సీఎం కేసీఆర్ కు ఇవ్వాలి
ప్రపంచ ఝూటా అవార్డు అంటూ ఉంటే దానిని సీఎం కేసీఆర్ కు ఇవ్వాలని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. మా ఎమ్మెల్యేలను మూడు తోకలు అంటావా? మీకు దమ్ము, ధైర్యం ఉంటే మా ముగ్గురు ఎమ్మెల్యేలను ఎందుకు అసెంబ్లీ నుంచి బయటకు పంపించావో చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ కరెంట్ మీటర్ అంటున్నాడని, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ కు సిగ్గు రాలేదని డీకే అరుణ మండిపడ్డారు.
కేసీఆర్ జాతీయ పార్టీ ఇందుకే .. మండిపడిన డీకే అరుణ
ప్రజలను మోసం చేస్తూ కెసిఆర్ పబ్బం గడుపుకుంటున్నాడని డీకే అరుణ ఆరోపించారు. కెసిఆర్ తన వైఫల్యాలను, తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే జాతీయ పార్టీ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసి కేసీఆర్ కే మీటర్లు పెట్టాలని డీకే అరుణ తెలిపారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు.
కేసీఆర్ నియంత పాలనను బీజేపీ అంతం చేసి తీరుతుంది
కెసిఆర్ నియంత పాలనను బిజెపి అంతం చేస్తుందని డీకే అరుణ హితవు పలికారు. భారత్ జోడో కాదు ముందు రాహుల్ గాంధీ తన పార్టీని జోడో చేసుకోవాలని డీకే అరుణ సూచించారు. కెసిఆర్ చెప్పే ఝూటా మాటలను ప్రజలెవరూ నమ్మబోరని డీకే అరుణ స్పష్టం చేశారు.
దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో బిజెపి కార్యకర్తలు పార్టీ అభ్యర్థిని ఏవిధంగా గెలిపించుకున్నారో మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటారని డీకే అరుణ స్పష్టం చేశారు. పదేపదే బిజెపి పేరు ఎత్తడం, కెసిఆర్ కు ఉన్న భయానికి నిదర్శనమని డీకే అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు.