తనది చెత్తపాలన అని కేసీఆర్ ఒప్పుకున్నారు: ఎర్రబెల్లి
హైదరాబాద్: తన పాలన అధ్వాన్నంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంగీకరించారని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం అన్నారు. కేసీఆర్ది చెత్త పాలన అన్నారు. పేదలకు రేషన్ అందకుండా అడ్డగోలు జీవోలు ఇచ్చి ఇప్పుడు అధికారుల్ని నిలదీయడమేమిటన్నారు.
ఆయనకు ధైర్యం ఉంటే కాకతీయ విశ్వవిద్యాలయానికి, ఎనుమాముల మార్కెట్కు వెళ్లాలని సవాల్ చేశారు. కేసీఆర్ పాలన చెత్త పాలన అని, అదే మాట మేం అంటే తెరాస నేతలు మాపై గజ్జకుక్కల్లా పడ్డారన్నారు. సంక్షేమ పథకాలు ఒక్క వరంగల్లో అమలుచేయడం కాదని, తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలన్నారు.
సోమవారం కూడా కేసీఆర్ వరంగల్లో ఉండి ఎనుమాముల మార్కెట్ను సందర్శించాలని, జీవో 59ని రద్దు చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడిగానే వ్యవహరిస్తున్నారని, అధికారులను దూషిస్తున్నారని ఆయన విమర్శించారు.
రేపు ఉదయం 7 గంటలకు కేసీఆర్ ఎనుమాముల మార్కెట్కు వెళితే ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరని చేతులెత్తి నమస్కరిస్తానని ఎర్రబెల్లి అన్నరాు. ఆ మార్కెట్కు వెళితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో, గిట్టుబాటు దరలు ఎందుకు రావడం లేదో తేలుతుందన్నారు.
కాగా, వరంగల్ జిల్లాలో ప్రజావసరమైన వసతులు సరిగా లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం వరంగల్లో నాలుగవరోజు పర్యనలో భాగంగా నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడారు. తొమ్మిది వాడల్లో పర్యటించానని, ఎక్కడ చూసినా ప్రజల పరిస్థితి సరిగాలేదని అన్నారు.
పేద ప్రజలను ఆదుకుంటామని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అరిస్తే పనులు కావని, శాంతంగా ప్రజాప్రతినిధలను కలిసి తమ సమస్యలను తెలిపి పనులను చేయించుకోవాలని సూచించారు. పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిందని, ఇందులో భాగంగా ఆటో, డీసీఎం ఎవరు ఏది నడిపితే అది అందజేస్తామన్నారు.