యాదాద్రి స్తంభాలపై గులాబీ ప్రచారం: శిల్పాలుగా సారు..కారు సర్కారు
తెలంగాణ ప్రాంతంలో కొలువై ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ప్రభుత్వం ఎంతో ఖర్చుతో ప్రతిష్ఠాత్మకంగా ఆలయాన్ని తీర్చి దిద్దుతోంది. ఈ ఆలయం నిర్మాణం సైతం అధ్బుతంగా తీర్చి దిద్దుతున్నారు. అయితే.. రాజుల కాలంనాటి నిర్మాణ రీతులను పుణికి పుచ్చుకుని ఆలయాన్ని తీర్చిదిద్దుతున్న ఈ ఆలయంలో శిల్పాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం ..
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు చెక్కి ఉంటుంది. అంతటితో ఆగలేదు...టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన కేసీఆర్ కిట్, తెలంగాణకు హరితహారం తదితరాలూ రాతి స్తంభాలపై కనిపించనున్నాయి. దీంతో..ఇది ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు చెక్కారా..లేక ఎవరైనా అత్సుత్సహం ప్రదర్శించారా అనే చర్చ మొదలైంది.

రాతి స్తంభాల పైన సారు..కారు..సర్కారు
రాబోయే వెయ్యేళ్ల పాటు వెలిగిపోయేలా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తీర్చి దిద్దుతున్నామని ప్రభుత్వం అనేక సార్లు చెప్పుకొంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు యాదాద్రి పర్యటించి అక్కడ పనులను పర్యవేక్షించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణం పైన అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. అటువంటి ప్రత్యేకత ఉన్న ఆలయంలో ఇప్పుడు కొత్త చిత్రాలు దర్శనమిస్తున్నాయి.
ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం..టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు చెక్కి దర్శనమిస్తాయి. వీటితో పాటుగా భుత్వ ప్రాధాన్య పథకాలైన కేసీఆర్ కిట్, తెలంగాణకు హరితహారం తదితరాలూ రాతి స్తంభాలపై కనిపించనున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలను ఇలా దేవాలయం మీద చెక్కటం వివాదాస్పదమైంది. పురాతన ఆలయాలపై అలనాటి చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను చెక్కటం సర్వ సాధారణం. కానీ, ఇక్కడ దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి..పార్టీ గుర్తు.. ప్రభుత్వ పధకాలను చెక్కటం పైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

చరిత్ర ఉండాల్సిన చోట రాజకీయ గుర్తులు..
ఏ దేవాలయంలో అయినా పురాతన కాలపు నిర్మాణ రీతులు.. అప్పట్లో వినియోగించిన నాణేలు, వ్యవసాయ పద్ధతులు.. ఆచరించిన ధర్మాలను రాతి స్తంభాలపై చెక్కారు. శతాబ్దాల కాలం నాటి రాతి స్తంభాలపై చిహ్నాలు, బొమ్మలు ఆనాటి ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. రాజుల కాలంనాటి నిర్మాణ రీతులను పుణికి పుచ్చుకుని ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంత వరకు బాగానే ఉంది. ఆలయంలోని కృష్ణ శిలలపై నేటి సంస్కృతి, సంప్రదాయాలతోపాటు రాజకీయ అంశాలను కూడా పొందుపరుస్తున్నారు. ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాసాలు, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ప్రజల జీవన విధానం, ఆధునిక తెలంగాణ చరిత్రను రాతి స్తంభాలపై శాశ్వతపరుస్తున్నారు. అష్టభుజి ప్రాకార మండప రాతిస్తంభాలపై ప్రస్తుతం చలామణీలో లేని పైసా, రెండు, మూడు, ఐదు, ఇరవై పైసల నాణేలు పొందుపరిచారు. అలాగే, బతుకమ్మ వంటి పండుగలు, నాగలి దున్నే రైతు వంటి బొమ్మలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిక్షిప్తం చేశారు. తాజాగా ప్రాకార మండపానికి దక్షిణం వైపుగల రాతి స్తంభాలపై తెలంగాణ ఆధునిక చరిత్ర, ప్రభుత్వ పథకాలతోపాటు రాజకీయ అంశాలను చెక్కుతున్నారు. ఇదే ఇప్పుడు వివాదాస్పద చర్చకు కారణమవుతోంది.

ప్రభుత్వ ఆదేశాల..శిల్పుల అత్యుత్సాహమా..
అయితే..దేవాలయంలో రాజకీయ అంశాలను చెక్కటం పైన బాధ్యత ఎవరనే దాని పైన చర్చ మొదలైంది. దేవాలయ ప్రాంగణంలోని అష్టభుజి ప్రాకార మండపాల బాలపాద పిల్లర్లపై ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు.. ప్రభుత్వ పథకాలైన తెలంగాణకు హరితహారం.. కేసీఆర్ కిట్.. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం.. తెలంగాణ చిత్రపటంలో చార్మినార్...రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక..జాతీయ పక్షి నెమలి వంటి చిహ్నాలను చెక్కుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానాన్ని రాతి స్తంభాలపై నిక్షిప్తం చేయాలని, భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారని ఆలయ శిల్పులు చెబుతున్నారు. కానీ, రాతి స్తంభాలపై కేసీఆర్ చిత్రం; టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు తదితరాలను చెక్కాలని ప్రభుత్వం నుండి సూచనలు వచ్చాయా.. లేక ఆలయ శిల్పులు అత్యుత్సాహంతో వాటిని చెక్కుతున్నారా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇక, ఈ వ్యవహారం రాజకీయంగానూ విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications