క్రీడలకు ప్రోత్సాహం.. తండావాసులతో ఖోఖో ఆడిన యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
జిల్లా యంత్రాంగాన్ని ముందుకు నడిపించే కలెక్టర్లు ఎప్పుడూ బిజీగా ఉంటారు అన్నది అందరికీ తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ, వివిధ శాఖల్లో ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తూ,ప్రభుత్వ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూ బిజీగా ఉండే కలెక్టర్లు, తాము చేస్తున్న పనిలోనే కొద్దిపాటి ఆటవిడుపును ఆస్వాదించటానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఆ కోవలోనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తండా వాసులతో కలిసి ఖోఖో ఆడి సందడి చేశారు.
ఆస్పత్రుల దుస్థితిపై విడదల రజిని ఫైర్; మెరుగైన వైద్యం లక్ష్యంగా అధికారులకు మంత్రి ఆదేశం!!
పమేలా సత్పతి నిత్యం జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు పని చేస్తున్నారు. తాజాగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పల్లె ప్రగతి పనులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం మీది తండాలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ సత్పతి పల్లె ప్రగతి గురించి చిన్న చిన్న తండాల్లో కూడా అవగాహన వచ్చిందని పల్లెల్లో పచ్చదనం నెలకొందని పమేలా సత్పతి వెల్లడించారు. గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడా మైదానాలు నిర్మించేందుకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. యువత కోసం క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశామని, సెలవు రోజుల్లో ఆటస్థలం ఉపయోగించుకోవాలని కలెక్టర్ సత్పతి పేర్కొన్నారు.
ఆట వస్తువులు అందజేయడం కోసం కూడా తాను కృషి చేస్తానని వెల్లడించారు. క్రీడాస్థలం ఇంకా ఉంటే క్రికెట్ మైదానాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. యువత ఆట స్థలాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆటలు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని పమేలా సత్పతి వెల్లడించారు. ఇక అక్కడ తండా వాసులతో కలిసి కలెక్టర్ క్రీడా మైదానంలో కాసేపు ఖోఖో ఆడారు. కలెక్టర్ సత్పతి తమతో కలిసి ఖోఖో ఆడడంతో తండావాసులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.