ఏపీ వద్దు, తెలంగాణలోనే కలపండి: విలీన గ్రామాల ప్రజల ఆందోళన, హెచ్చరిక
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలు మరో సమస్యను తెచ్చిపెట్టాయి. ఇప్పటికే ఏపీలో విలీనం చేసిన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అలా ఎలా మళ్లీ తెలంగాణలో కలుపుతారంటూ మండిపడుతున్నారు ఏపీ మంత్రులు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసిన గ్రామాలను తెలంగాణలో కలపాలని అల్లూరి జిల్లాలోని విలీన గ్రామాలైన ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో కన్నాయిగూడెం ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.

రాష్ట్ర విభజనతో తమ బతుకులు ఆగమ్య గోచరంగా మారాయని, విద్య, వైద్యం లాంటి కనీస వసతులకు దూరంగా ఉన్నామని వాపోయారు. ప్రతి సంవత్సరం గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆ గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల కురిసన భారీ వర్షాలతో భద్రాచలంతోపాటు అనేక గ్రామాలు వరదనీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోదావరి వరదను నియంత్రించేందుకు కరకట్టలు బలోపేతం చేయాల్సి ఉందని, అందుకే ఏపీలో విలీనమైన మండలాలు, గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరారు.
అంతేగాక, పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముంపు ప్రమాదం పొంచివుందని, అందుకే ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే భద్రాచలం వద్ద 45 అడుగుల వరద ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసిన ఏడు మండలాలు, భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని మంత్రి డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణ విలీనం చేయాలని కోరారు. అయితే, పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు మండిపడ్డారు. హైదరాబాద్ ను తాము కావాలంటే ఏపీలో కలిపేస్తారా? అంటూ ప్రశ్నించారు. అంతకంటే, రెండు రాష్ట్రాలను కలిపితే తాము స్వాగతిస్తామన్నారు.












Click it and Unblock the Notifications