మోత్కుపల్లి ని అక్కున చేర్చుకుని ఏపిలో చంద్రబాబు పై ఉసిగొలిపే ప్రయత్నం.. వైసిపి మరో వ్యూహం.
టీటీడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి సంప్రదించే ప్రయత్నం చేసారు. కాని మోత్కుపల్లి నివాసం వద్ద మీడియా హడావిడి చూసిన విజయసాయి రెడ్డి వెనక్కు వెళ్లిపోయారు. చంద్ర బాబు పై వ్యతిరేక గళం వినిపిస్తున్న మోత్కుపల్లిని ఆంద్రాలో పర్యటింపజేసి బాబుకు వ్యతిరేకంగా మాట్లాడించాలన్నది వైసీపి ప్రణాళికగా తెలుస్తోంది. తెలంగాణ కు చెందిన మోత్కుపల్లి మాటలను ఆంద్ర ప్రజలు ఎంతవరకు విశ్వశిస్తారన్నది కూడా ప్రశ్నార్థకమే..
చంద్రబాబు వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో వైసీపి..
తెలంగాణ లీడర్ మోత్కుపల్లి నర్సింహులుకు ఆంధ్రా రాజకీయ నాయకులు గాలం వేయబోతున్నారా ? చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీతో ఆయన చేతులు కలుపుతారా ? మొన్న మోత్కుపల్లి నివాసానికి ఏపి కాపుసంఘం నేత ముద్రగడ పద్మనాభం చేరుకుని మంతనాలు జరిపారు. నేడు హైదరాబాద్ లో ఉన్న మోత్కుపల్లి ఇంటిచుట్టూ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎందుకు చక్కర్లు కొడతారు ? వైసీపీతో ఇన్నాళ్లు వీసమెత్తు సంబంధం లేని మోత్కుపల్లితో విజయసాయి రెడ్డికి పనేంటి ? మోత్కుపల్లి ఇంటిదగ్గర మీడియాను చూసి విజయసాయి వెనుదిరగడం వెనుక ఆంతర్యం ఏమిటి ? అవును, ఇదంతా చూస్తుంటే కచ్చితంగా మోత్కుపల్లికి వైసీపీ ఓ టాస్క్ అప్పగించబోతోందనిపిస్తోంది. ఇంతకీ ఆ టాస్క్ ఏమై ఉంటుంది ?
మోత్కుపల్లి చేత ఏపిలో బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయించాలని వైసిపి ప్రణాళిక..
వైసీపీ ప్లాన్ లో భాగంగా మోత్కుపల్లి ఆంధ్ర ప్రదేశ్ లో ఊరూవాడా తిరగాలి. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. దీనికి అవసరమైన సరంజామా అంతా ఆ పార్టీ సర్దుబాటు చేస్తుంది. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి మోత్కుపల్లిని కలిసేందుకు ప్రయత్నించారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి బహిష్కరించిన నాడే మోత్కుపల్లి పరోక్షంగా ఈ విషయం ప్రకటించారు. తాను ఆంధ్ర ప్రదేశ్ అంతటా తిరిగి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు. పైగా తెలంగాణలో కేసీఆర్ అంత, ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అంత సమర్ధుడైన నాయకుడు మరొకరు లేరని నోరు పట్టనంత స్థాయిలో వారిద్దరిని ఆకాశానికి ఎత్తేశారు. ఇంతలో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆయన గులాబీ గూటికి చేరతారో లేదో... చేరేందుకు గులాబీ బాస్ అంగీకరిస్తారో లేదో తెలియదు కానీ, వైసీపీ మాత్రం మోత్కుపల్లి సేవలు వినియోగించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్టుంది.
ఏపిలో మోత్కుపల్లి పర్యటనలకు వైసిపి పూర్తి సహకారం..
మోత్కుపల్లిని తీసుకువెళ్లి దళిత వాడల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయించాలన్నది ఆ పార్టీ ప్లాన్ అంటున్నారు. అయితే, తెలంగాణ రాజకీయాల్లో ఇన్నాళ్లు మునిగి తేలిన మోత్కుపల్లి మాటలు ఆంధ్రాలో దళితులు వింటారా అన్నది ప్రశ్న. రెండేళ్ల క్రితం మందకృష్ణ మాదిగ వర్గీకరణ పేరుతో ఆంధ్రాలో ఉద్యమం రాజేసే ప్రయత్నం చేశారు. కానీ, అది వర్కవుట్ కాలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో మాదిగ కంటే మాల సామాజికవర్గం సంఖ్యాబలం ఎక్కువ. ఆంధ్ర ప్రదేశ్ నే తన రాజకీయానికి ప్రధాన కేంద్రంగా మార్చుకున్న చంద్రబాబు మాలల అభిమానం పొందాలనే ఉద్దేశంతోనే వర్గీకరణ పై మిన్నకుండిపోయారు.
మోత్కుపల్లి మాటలను ఏపి ప్రజలు విశ్వసిస్తారా..
చంద్రబాబు సైలెంట్ అయినా మోత్కుపల్లి మాత్రం వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం చేయాలని ఆయన పై పదే పదే ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు అదే మోత్కుపల్లి వెళ్లి ఆంధ్రాలో ప్రచారం చేస్తే ఏ మేరకు ప్రయోజనం ఉంటుందన్నది ప్రశ్న. వైసీపీ ఈ లాజిక్ మిస్ అయినట్టు కనిపిస్తోంది. ఆంధ్రాలో దళితులు వైసీపీకి సానుకూలంగా ఉంటారన్న భావన ఉంది. ఇప్పుడు చంద్రబాబు పై కోపంతో మోత్కుపల్లిని ప్రయోగిస్తే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. కోపం విచక్షణను మింగేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు పై వైసీపీ నేతల మానసిక స్థితి ఇదే అనుకోవచ్చా అనే అంశం కాలమే నిర్ణయించాలి.