బీరు అప్పుగా ఇవ్వనందుకు యువతి గొంతు కోసిన యువకుడు
నల్లగొండ: బీరు అరువుగా ఇవ్వలేదని యువతి గొంతు కోసిన దారుణమైన ఘటన శుక్రవారం నల్గొండ జిల్లా నూతనకల్ మండలం చిననెమిలలో జరిగింది. చిననెమిల గ్రామానికి చెందిన ఐతరాజు మహేష్ (17) గొలుసు దుకాణంలో మద్యం సేవించి అనంతరం అరువుగా మరోబీరు ఇవ్వాలని అడిగాడు.
నిర్వాహకురాలు లింగాల రేణుక నిరాకరించింది. దీంతో ఆవేశానికి లోనైన మహేష్ బ్లేడ్తో నిర్వాహకురాలి గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న రేణుకను స్థానికులు సూర్యాపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
నిందితుడు మహేష్ పోలీసుల అదుపులోఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాసి హైదరాబాద్లోని రంగారెడ్డి కోర్డు ప్రాంగణంలోని జ్యూస్ దుకాణంలో పనిచేస్తున్నాడు. బుధవారమే గ్రామానికి వచ్చాడు. గురు, శుక్రవారం నుంచి స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. శుక్రవారం తాగిన మత్తులోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
బీరు ఇవ్వకుండా తన భర్త వచ్చినప్పుడు తీసుకోమని ఆమె సమాధానం ఇచ్చింది. దీంతో మహేష్ అక్కడే ఉన్న బ్లేడును తీసుకొని రేణుక గొంతు కోశాడు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. అయితే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తమకు ఫోన్ ద్వారా సమాచారం అందినట్లు ఎస్హెచ్ ఆఫీసర్ అంజన్రెడ్డి తెలిపారు.