అనుమానమే నిజమైంది.. ఆ ఫోటోల్లో ఉన్నది తమవాడేనని తెలిసి.. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఊహించని ప్రమాదం
అది పెద్దపల్లి రైల్వే స్టేషన్... సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కోసం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు... రైలు కదిలేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారు... కాసేపటికే ఓ అనుకోని ప్రమాదం జరిగింది... పట్టాలపై ఉన్న ఓ యువకుడిని సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది... చాలామంది ప్రయాణికులు అతని మృతదేహం చుట్టూ చేరి సెల్ఫోన్లలో ఫోటోలు,వీడియోలు తీస్తున్నారు. ఇదే క్రమంలో ఓ యువతి కూడా ఫోటోలు తీసింది.
ఆపై రైల్లోకి ఎక్కి తన తల్లిదండ్రులకు ఆ ఫోటోలు చూపించింది... అప్పుడే ఓ అనుమానం వచ్చింది... తర్వాత ఆ అనుమానమే నిజమైంది... ఆ ఫోటోలో ఉన్నది తమ కుమారుడేనని గుర్తించి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు...
అసలేం జరిగింది...
మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ ఏరియాలో శ్రీనివాస్-రాణి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి విశాల్ అనే కుమారుడితో పాటు కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ స్థానిక సింగరేణి వర్క్షాపులో పనిచేస్తున్నాడు.వీరి కుమార్తె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. ఇటీవల ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలు మూసివేయాలని నిర్ణయించడంతో ఆమె చదువుతున్న కాలేజీ కూడా మూతపడింది. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకొచ్చేందుకు ఆ తల్లిదండ్రులు కుమారుడు విశాల్తో కలిసి గత వారం హైదరాబాద్ వెళ్లారు.
పెద్దపల్లి రైల్వే స్టేషన్లో క్రాసింగ్ పెట్టడంతో....
కుమార్తెను కాలేజీ హాస్టల్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లోనే రెండు రోజుల పాటు బంధువుల ఇళ్లల్లో ఉన్నారు. శనివారం(మార్చి 27) కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ నుంచి మందమర్రి బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 12గంటల సమయంలో రైలు పెద్దపల్లి స్టేషన్కు చేరుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ను పంపించడం కోసం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. క్రాసింగ్ పెట్టడంతో.. చాలా సమయం పడుతుందని భావించి కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారు. ఈ క్రమంలో విశాల్ కూడా కిందకు దిగి అటు,ఇటు తిరుగుతున్నాడు.
అనుమానమే నిజమైంది...
ఇంతలో సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ మీదుగా వేగంగా దూసుకెళ్లింది. రైలు వెళ్లిన తర్వాత పట్టాలపై ఓ యువకుడి మృతదేహం పడి ఉండటాన్ని ప్రయాణికులు గమనించారు. రైలు ఢీకొట్టడంతో చనిపోయినట్లు గుర్తించారు. అంతా అక్కడ గుమిగూడి సెల్ఫోన్లతో ఫోటోలు,వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలో విశాల్ సోదరి కూడా రైలు నుంచి కిందకు దిగి పట్టాలపై పడి ఉన్న గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని ఫోటోలు తీసింది. ఆపై రైల్లోకి ఎక్కి తల్లిదండ్రులకు ఆ ఫోటోలు చూపించింది. అంతే... అప్పుడే వారిలో అనుమానం మొదలైంది... కాస్త పరిశీలించి చూడగా... ఆ మృతదేహం తమవాడిదేనని వారు గుర్తించారు.
కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు
అప్పటిదాకా తమతో పాటే ఉన్న విశాల్ రైలు ఢీకొని చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు,అతని సోదరి కన్నీరుమున్నీరుగా విలపించారు. రైలు దిగి ఆ మృతదేహం పడి ఉన్న స్థలం వద్దకు వెళ్లి బోరున ఏడ్చారు. అనంతరం అధికారులు మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహించారు. కొడుకు మృతిని తట్టుకోలేక కుప్పకూలిన తండ్రి శ్రీనివాస్ను సింగరేణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు గంటల చికిత్స అనంతరం తిరిగి మందమర్రిలోని ఇంటికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.