పెళ్లి పేరుతో గర్భవతిని చేశాడు: గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా పాస్టర్
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో రెండు దారుణమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓ యువకుడు పెళ్లి చేసుకున్నట్లు నటించి యువతిని లొంగదీసుకుని గర్భం చేశాడు. ఆ తర్వాత తనకు సంబందం లేదని ప్లేట్ ఫిరాయించాడు. దుండిగల్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం - తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రికి చెందిన సామ్యేల్ కుటుంబం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి సూరారం కాలనీ సీజీఎం చర్చి సమీపంలో స్థిరపడింది. సామ్యేల్ కొడుకు ఎలిపే శైలేష్కుమార్(24) బీటెక్ పూర్తి చేసిన అనంతరం ఓ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు.
ఏడాది కిందట రాజమండ్రికే చెందిన సురేఖ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల నుంచే శైలేష్కుమార్ సూరారంకాలనీలో ఉండే యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు.

ఇటీవల ఆమె గర్భవతికావడంతో ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో శైలేష్కుమార్ను నిలదీశారు. అయితే తనకు ఏ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. బాధితురాలు దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదిలావుంటే, యువతితో చర్చి పాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన హైదరాబాద్ నగర శివారులో చోటు చేసుకుంది. నగరంలోని సంజీవరెడ్డినగర్ సమీపంలోని జికెగూడకు చెందిన జయదేవికిశోర్ అలియాస్ డేవిడ్ అతని చెల్లెలు, అక్క చింతల్లోని గౌతమి కళాశాల సమీపంలో గల చర్చిలో ప్రెయర్ చేసేందుకు వచ్చారు.
డేవిడ్ చెల్లెలు ఆశ్విని ఆరోగ్య స్థితి గతులు బాగలేవని, అందుకు తమ ఇంటి పరిస్థితులు అనుకూలిచడం లేదని చర్చి పాస్టర్ రవిచంద్ర (30)కు తెలిపారు. నయం చేస్తానని చెప్పడంతో ముగ్గురు పాస్టర్ ఇంటికి వచ్చారు. పక్కనే ఉన్న చర్చిలో ప్రార్థనలు చేయించారు.
అనంతరం డేవిడ్ చెల్లెలిని పాస్టర్ పక్క గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా ఆమె ప్రతిఘటించి బయటకు వచ్చేసింది. ఈ విషయం తన అన్న డేవిడ్కు చెప్పింది. తన చెల్లెలు పై జరిగిన అఘాయిత్యాన్ని జీడిమెట్ల పోలీస్స్టేషన్లో తెలియజేస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక ఎస్సై లింగ్యా నాయక్ ప్రాథమిక దర్యాప్తు చేసిన అనంతరం ఫాస్టర్ రవిచంద్రపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.












Click it and Unblock the Notifications