కాలనీల్లో యువత మందు,విందు,పసందు.!తెల్లవార్లూ అదో రకమైన న్యూసెన్స్.!కంటికి కనిపించని పెట్రోలింగ్.!
హైదరాబాద్ : ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ లక్ష్యం గాడి తప్పుతోంది. సమాజానికి రక్షణ కల్పిస్తున్న పోలీసుల పట్ల ప్రజల్లో నెలకొన్న భయాలను, సందేహాలను, తొలగించి స్నేహపూర్వక వాతావరణం పెంపొందించే లక్ష్యంతో రూపకల్పన చేసిన వ్యవస్థను కొంత మంది ఆకతాయిలకు, తాగుబోతులకు వరంగా మారింది. రాత్రి పూట అందరూ నిద్రలోకి జారుకునే సమయంలో వీరి ఆగడాలకు తెరతీస్తున్నారు.
బర్త్ డే పేరుతో, ఉద్యోగం వచ్చిందని, జీతం పెరిగిందని ఏదో ఒక కారణంలో కాలనీలలోని రోడ్ల మీదకు చేరుకుని మందు పార్టీలు చేసుకుంటూ కేకులు కట్ చేసి న్యూసెన్స్ చేయడం వీరికి నిత్య కృత్యంగా మారింది.

రెచ్చిపోతున్న యువత..
గతంలో నగర కాలనీలలోకి పెల్రోలింగ్ వాహనాలు సైరన్ వేసుకుంటూ తాగుబోతులకు, దొంగలకు, ఇతర సంఘ విద్యోహ శక్తులకు హెచ్చరికలు జారీ చేస్తూ గస్తీ నిర్వహిస్తుండేవి. అనుమానంగా సంచరిస్తున్న వారితోపాటు తప్పతాగి కాలనీల్లో న్యూసెన్స్ చేస్తున్న యువతను ఈ పెట్రోలింగ్ పోలీసులు నియంత్రించేవారు. దీంతో కాలనీల్లో అంతగా తాగుబోతుల బెడద ఉండేది కాదు.
కానీ పరిస్థితులు ఇప్పుడు అలా లేవు. మందు మోతాదు ఎక్కువైన తర్వాత తాగుబోతులు వీరంగం చేయడం సహజం. కాని చదువుకునే యువత, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకునే నిరుద్యోగులు, చదువు మద్యలో ఆగిపోయిన యువకులు కూడా టైమ్ పాస్ పేరుతో తెల్లవార్లూ న్యూసెన్స్ చేయడం కాలనీల్లో పరమ దరిద్ర్యంగా పరిణమించింది.

పార్టీల పేరుతో వీరంగం..
నగరంలో అపార్ట్ మెంట్ కల్చర్ కు, ఇండిపెండెంట్ హౌసింగ్ నివాసాలకు తేడా ఉంటుంది. ఇండిపెండెంట్ కాలనీల్లో ఇంటి యజమానులమనే అహంభావంతో చాలా మంది వ్యవహరించడం, పది మంది స్నేహితులను వెంటేసుకుని నడిరోడ్ల పైన తాగడం, ఇదేంటని ప్రశ్నించిన వారిపట్ల దురుసుగా వ్యవహరించడం నేటి కాలనీల్లో సహజంగా జరిగిపోతున్నాయి. కొన్ని సందర్బాల్లో అంగబలం చూసుకుని అకారణంగా బౌతిక దాడులకు పాల్పడుతుండడం విచారాన్ని కలిగిస్తుంది. ఇంత జరుగుతున్నా కాలనీలలోకి పెట్రోల్ వాహనాలు తిరగకపోవడం, అనుకున్నంత నిఘా లేకపోవడంతో ఈ ఆకతాయిల న్యూసెన్స్ కు పట్టపగ్గాలు లేకుండా పోతుంది.

పత్తాలేని పెట్రోలింగ్ వ్యవస్థ..
ఇంత న్యూసెన్స్ చేస్తున్న తాగుబోతు యువతపై 100కు ఫోన్ చేసి చెప్పినా, స్థానికంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా తర్వాత ప్రతీకారంతో రగిలిపోయే యువత ఫిర్యాదు చేసిన వ్యక్తులపైన, అభం శుభం తెలియని వారి సంతానం పైన ఎక్కడ దాడులు చేస్తారనో చాలవరకూ చాలా మంది కాలనీ వాసులు భరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇళ్ల యజమానులు పిల్లలు తాగి తందానా చేస్తున్నప్పుడు తోటి యజమానులు వారించాలి. అలా కాకుండా కిరాయి దారులు ఏంటని ప్రశ్నిస్తే తప్పక ప్రతిఘటన ఎదురయ్యే పరిస్తితులు నెలకొన్నాయి.

అలంకారం కోసమే సీసీ కెమెరాలు..
నగరంలో సీసీ కెమారాలు ఉన్నా, వాటిలో యువత చేస్తున్న న్యూసెన్స్ అంతా రికార్డ్ అవుతున్నా పట్టించుకున్న నాధుడు ఎవరు.? అసెంబ్లీ సమావేశాల్లో, రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవాల్లో, శాంతిభద్రత నివేదికలు సమర్పించే సమయాల్లో సీసీ కెమెరాల లెక్క చెప్పుకోవడానికి తప్ప మరెందుకు ఉపయోగపడుతున్నాయో పోలీసులే స్పష్టత ఇవ్వాలి.
కాలనీల్లో యువత ఆగడాలు అరికట్టేందుకు, తాగుబోతుల వికృత చర్యలను నియంత్రించేందుకు పోలీసులు పెట్రోలింగ్ వ్యవస్ధను పునరుద్దరించాల్సిన సమయం మళ్లీ ఆసన్నమైనట్టు తెలుస్తోంది. పగలంగా డ్యూటీ చేసుకుని అలసిపోయి ఓ నాలుగు గంటలు ప్రశాంతంగా పడుకుందామంటే శరాఘాతంగా మారిన యువతని నియంత్రించడానికి పోలీసులు మళ్లీ లాఠీ ఝళిపించాల్సిన సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం మంత్రి కేటీఆర్ ట్వీట్ అవసరం లేదనేది కాలనీ వాసుల అభిప్రాయం.












Click it and Unblock the Notifications