కెసిఆర్! ఎప్పుడైనా పొలానికెళ్లారా? వెళ్తే తెలిసేది: జగన్, దర్గాలో ప్రార్థనలు
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన బుధవారం గీసుకొండలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కెసిఆర్ ఎప్పుడైనా పొలం వెళితే రైతుల కష్టాలు తెలిసేవని అన్నారు.
పత్తి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అది బాగోలేదు, ఇది బాగోలేదంటూ రైతుల వద్ద నుంచి పత్తిని కొనడం లేదని, ఈ విషయం కెసిఆర్కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు.
పత్తి పండించేందుకు రైతులు పడుతున్న కష్టాలు చూడాలని..., ఒకసారి పత్తి పొలాలకు వస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు. పత్తికి కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. రైతన్న ఆరుగాలం శ్రమించి పత్తి పండిస్తే... ఇవాళ మార్కెట్లో కొనే నాథుడే లేరని ఆరోపించారు.
ప్రస్తుతం పత్తి క్వింటాల్ కి 4,100 వస్తుందని, అదే రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ. 6,700 వరకూ వచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు.
కె చంద్రశేఖర్ రావు అధికారం చేపట్టి 18 నెలలు అవుతోందని, ఈ కాలంలో ఆయన ప్రజలకు పంచింది కేవలం 16వందల ఎకరాలు మాత్రమేనని వైయస్ జగన్ అన్నారు. దివంగత సిఎం వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో 20 లక్షల 60వేల ఎకరాల భూములు పంచారని చెప్పిన ఆయన.. అధికారంలోకి వచ్చాక ఎంత భూమిని పంపిణీ చేశారనే విషయాన్ని కెసిఆర్ను గట్టిగా నిలదీయాలని ప్రజలకు సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్కు ఓటు వేసి గెలిపించాలని జగన్ కోరారు.
దర్గాను దర్శించుకున్న జగన్
వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం కాజీపేటలోని ప్రఖ్యాత హజరత్ సయ్యద్ షా దర్గాను దర్శించుకున్నారు. పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ తదితరులతో కలిసి జగన్ హన్మకొండ నుంచి ర్యాలీగా బయలుదేరి దర్గాకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా కుసుర్ పాషా, ఇతర మతపెద్దలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో కొద్దిసేపు జగన్ ప్రార్థనలు చేశారు. తన తండ్రి, దివంగత వైయస్ ముస్లింల కోసం రిజర్వేషన్లు సహా ఎంతో చేశారని, అవన్నీ దృష్టిలో ఉంచుకుని ముస్లింలందరూ తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్కు మద్దతు పలకాలని కోరారు.