మాయలఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు, కేసీఆర్ అవినీతి సొమ్మంతా ఆయన చేతిలోనే!!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరదల సమయంలో లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ లు ముంపుకు గురి కావడంపై, అలాగే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనుల్లో జరిగిన దుర్ఘటనపై ఈ ప్రాజెక్ట్ ల కాంట్రాక్ట్ లు ఇచ్చిన మేఘా సంస్థ ను టార్గెట్ చేసి వైయస్ షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు . ఒక్క షర్మిల మినహాయించి రాష్ట్రంలో మేఘా కంపెనీ గురించి ప్రధాన పార్టీల చీఫ్ లు ఎవరూ మాట్లాడడంలేదు.
తెలంగాణ రాష్ట్రంలోని 80 శాతం కాంట్రాక్ట్ లు మేఘా కంపెనీకే
ఇక కాంగ్రెస్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజల పరిస్థితులను తెలుసుకున్న దాఖలాలు లేవు. కానీ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల వరద ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేశారు. అక్కడి ప్రజల పరిస్థితులను బాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలోని 80 శాతం కాంట్రాక్ట్ లను తెలంగాణ ప్రభుత్వం మేఘా కంపెనీకి ఇవ్వడాన్ని వైయస్ షర్మిల ఇప్పటికే తప్పుబట్టారు.
కేసీఆర్ అవినీతి సొమ్ము అంతా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉంది
మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని, వారికి ఇచ్చిన కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేయాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇక తాజాగా మరోమారు మేఘా సంస్థ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు, కేసీఆర్ అవినీతి సొమ్ము అంతా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మేఘా కంపెనీ ఏమి చేసినా పట్టించుకోవటం లేదని విమర్శించారు.
దొంగలకు సద్ది కట్టినట్టు కాంట్రాక్టులన్నీ మేఘాకు కట్టబెట్టారు
మేఘా కంపెనీ పనితీరు వల్ల పంపు హౌస్ లు మునిగినా, ప్రాణాలు పోయినా అవేమీ లెక్క కాదన్నారు. గుట్టలు కొల్లగొట్టి మట్టిని ఇసుకను పక్క రాష్ట్రానికి తరలించినా, రూల్స్ కు విరుద్ధంగా చేసిన బ్లాస్టింగ్ ల వల్లే పంపుహౌస్ లు మునిగినా.. అవి దొర కమీషన్లు పెంచుకోవడానికి పనికొస్తాయి తప్పితే మేఘా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి పనికిరావు అని వైయస్ షర్మిల పేర్కొన్నారు. దొంగలకు సద్ది కట్టినట్టు కాంట్రాక్టులన్నీ మేఘాకు కట్టబెట్టారు అంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు.
మేఘా సంస్థ మీద ఈగ వాలకుండా కాపలా కాస్తున్నారు కేసీఆర్
మేఘా తీగ లాగితే తన అవినీతి డొంక కదులుతుందని మేఘా మీద ఈగ వాలకుండా కాపలా కాస్తున్నారు కేసీఆర్ అంటూ వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ లు మునగడంతో పాటుగా, ఇటీవల పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదటి స్టేజ్ వద్ద జరుగుతున్న పనులలో ట్రైన్ వైర్ తెగిపడి ఐదుగురు కార్మికులు పంప్ హౌస్ లో పడి చనిపోయిన ఘటన పై కూడా ఆమె నిప్పులు చెరుగుతున్నారు.
మేఘా సంస్థను టార్గెట్ చేస్తున్న షర్మిల... స్పందించని సర్కార్
చనిపోయిన వారి ప్రాణాలకు ఖరీదు ఎంత? ఈ చావుకు బాధ్యులెవరు అంటూ తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. మేఘా సంస్థ పై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. కెసిఆర్ మేఘా సంస్థ పై తన అవినీతి సొమ్ము కోసమే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వైయస్ షర్మిల పదేపదే టార్గెట్ చేస్తున్నారు. కానీ షర్మిల ఇంతగా టార్గెట్ చేస్తున్నా ప్రభుత్వం ఈ వ్యవహారంలో పట్టింపు లేనట్టు వ్యవహరించటం గమనార్హం.