ఎంపీ అరవింద్పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు -భైంసా అల్లర్లు -ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తావన
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడమేకాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెల్చుకుని అధికారాన్ని కూడా కైవసం చేసుకుంటామంటూ దూకుడు ప్రదర్శిస్తోన్న వైఎస్ షర్మిల టీఆర్ఎస్ తోపాటు బీజేపీని కూడా పదే పదే టార్గెట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ అడిగితేనో లేదా బీజేపీ పంపితేనో తాను రాలేదని, రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన తెచ్చేందుకే వచ్చానంటోన్న షర్మిల బీజేపీ ఎంపీ అరవింద్ పై భారీ సెటైర్లు వేశారు. ప్రొఫెసర్ కోదండరాం పేరును కూడా ప్రస్తావించారు. వివరాల్లోకి వెళితే..
ఆ రెండు జిల్లాల నేతలతో..
పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్న వైఎస్ షర్మిల వచ్చే నెల 9న ఖమ్మంలో జరగబోయే సభలో పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటిస్తారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వేదికగా శుక్రవారం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. వారిని ఉద్దేవించి కీలక ప్రసంగం చేశారు. ''రాజన్న కోసం నేను నిలబడతా.. తెలంగాణ ప్రజల కోసం నేను పోరాడుతా'' అని షర్మిల స్పష్టం చేశారు.
కోదండరాం ప్రస్తావన..
పచ్చటి అడవులు, కుంతాల జలపాతం, తెలంగాణ కాశ్మీర్ మన ఆదిలాబాద్ జిల్లా అని అభివర్ణించారు. జల్ జమీన్ జంగల్ పేరుతో నిజాంకి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ మన ఆదిలాబాద్ జిల్లా అని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామ చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాసి అని, ఉద్యమాన్ని నడిపిన కోదండరామ్ పుట్టిన గడ్డ అన్నారు. జలియన్ వాలా బాగ్ను తలపించే ఇంద్రవెల్లి ఘటన ఇంకా మనలను రగిలిస్తూనే ఉందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి వైఎస్సార్ అని గుర్తు చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్కి తలమానికమన్నారు. కాగా,
బీజేపీ ఎంపీపై సెటైర్లు..
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నేతలతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ''నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని ఎవరో బాండ్ పేపరో ఇచ్చారంట... బాండ్ పేపర్ ఇచ్చి రైతులను దగా చేశారట'' అంటూ అరవింద్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ''ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలియదా? పసుపు రైతుల కష్టాలు వర్ణనాతీతం, ఎక్స్ టెన్షన్ సెంటర్ ఇస్తే పసుపు రైతుల కష్టాలు తీరుతాయా? ప్రతి గడపకు పూసే పసుపు పండించే రైతు కష్టాలు కనపడటం లేదా?'' అని దుయ్యబట్టారు. అంతేకాదు,
భైంసా అల్లర్లపైనా..
పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి ప్రజల్ని మోసం చేశారండూ బీజేపీపై మండిపడ్డ వైఎస్ షర్మిల.. భైంసా అల్లర్లపైనా వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు బీజేపీ అనుబంధ సంఘాలే కారణమన్న పోలీసుల రిపోర్టు దరిమిలా.. ''బైంసాలో మతకల్లోలాలు సృష్టించడంపై ఉన్న ఆసక్తి రైతుల కష్టాలపై ఉండటం లేదా?'' అని బీజేపీ నేతలను ఉద్దేశించి షర్మిల ప్రశ్నించారు. బాసరలో ట్రిపుల్ ఐటీ, నిజామాబాద్లో యూనివర్సిటీని వైఎస్సార్ ఏర్పాటు చేశారని, నిజాం షుగర్ ప్రాజెక్ట్ను నడిపించే విధంగా అప్పుడు కేంద్రాన్ని సైతం వైఎస్సార్ ఒప్పించారని షర్మిల గుర్తుచేశారు. ఇదిలా ఉంటే..
పసుపు బోర్డుపై పిచ్చికుక్కల్లాగా..
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు బాండ్ పేపర్లు రాసిచ్చిమరీ ఎన్నికల్లో గెలిచిన అరవింద్.. తర్వాతి కాలంలో బోర్డును సాధించలేకపోవడం, అసలు బోర్డే ఉండదని కేంద్రం ఇటీవల స్పష్టం చేయడం, అంతలోనే తమిళనాడులో పసుపు బోర్డుకు బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం, దీనిపై టీఆర్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎంపీ అరవింద్ ఎదురుదాడికి దిగారు. తమిళనాడు బీజేపీ మేనిఫెస్టో పై టీఆర్ఎస్ నాయకులు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని, అక్కడ అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీచేస్తున్నాయని, అధికారంలోకి వస్తే పసుపు రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ పసుపు రైతులకు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగానే కేంద్రం సహాయం చేస్తున్నదని అరవింద్ గుర్తుచేశారు.