వైఎస్ఆర్టీపీ జగన్ పార్టీ నో అబ్జక్షన్ : ఆరు నెలల క్రితమే అంగీకారం : షర్మిల అధ్యక్షురాలయ్యేదప్పుడే..!!
హైదరాబాదు: వైఎస్సార్ కుమార్తె..ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ పేరు ప్రకటన లాంఛనమే. వైఎస్సార్ పేరుతోనే తన పార్టీ ఏర్పాటుకు షర్మిల వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఫిబ్రవరి 9న తాను తెలంగాణ లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా షర్మిల ప్రకటించినా..అసలు ఈ నిర్ణయమంతా గత డిసెంబర్ లోనే జరిగినట్లు స్పష్టమవుతోంది. తాను పార్టీ ఏర్పాటు తన అన్నకు ఇష్టం లేదనే విధంగా షర్మిల నర్మ గర్బ వ్యాఖ్యలు చేసారు. అయితే, తమ ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలే కానీ...విభేదాలు లేవన ఇటు షర్మిల..అటు జగన్ తరపు సజ్జల స్పష్టం చేసారు.

వాడుక రాజగోపాల్ ఛైర్మెన్గా..
వైఎస్ షర్మిల అన్నతో కాకుండా తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని భావించిన షర్మిల..ఈ విషయం పైన పెద్ద ఎత్తున కుటుంబలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే, తన తండ్రి పేరుతో ఇప్పటికే వైఎస్సార్ సీపీ ఉండటం..అది తెలంగాణలోనూ కొనసాగుతుండటంతో షర్మిల సాంకేతిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.తన తల్లి గౌరవాధ్యక్షురాలిగా..తన అన్న అధ్యక్షుడిగా ఉండగా.. తాను మరో పార్టీ వైఎస్సార్ పేరుతో ఏర్పాటు చేస్తే అభ్యంతరాలు వస్తాయనే కారణంతోనే కుటుంబ సన్నిహితుడు వాడుక రాజగోపాల్ చైర్మన్ లేదా అధ్యక్షునిగా వైఎస్ఆర్టీపీ ఏర్పాటుకు దరఖాస్తు చేసారు. అయితే, డిసెంబర్ లో ఎన్నికల సంఘానికి చేసిన దరఖాస్తు సమయంలోనే ఈ పార్టీ ఏర్పాటు పైన వైఎస్సార్ సీపీ నుండి ఎటువంటి అభ్యంతరం లేదని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఇచ్చిన నిరభ్యంతర సర్టిఫికెట్నూ ఎన్నికల కమిషన్కు సమర్పించినట్లు తెలుస్తోంది.

పార్టీ అధికారిక ప్రకటన అప్పుడే..
దీని ద్వారా షర్మిల ఫిబ్రవరిలో రాజకీయ ఎంట్రీ పైన ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టమవుతోంది. ఇక, ముందుగా షర్మిల తన రాజకీయ వ్యవహారాల సమన్వయకర్తగా ఉన్న వాడుక రాజగోపాల్ ద్వారా కొత్త పార్టీకి దరఖాస్తు చేయించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి అధికారికంగా అనుమతి వచ్చిన తరువాత పార్టీ పరంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు. ఆ తరువాత ఆ కార్యవర్గంలో షర్మిలను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకోవటం లాంఛనగా మారనుంది. జూలై 8వ తేదీన తన తండ్రి వైఎస్సార్ జన్మదినం నాడు షర్మిల తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. కరోనా తగ్గి..పరిస్థితులు అనుకూలిస్తే జూలై 21 నుండి పాదయాత్ర ప్రారంభించాలని షర్మిల భావిస్తున్నారు.

తండ్రి బాటలోనే... అక్కడి నుంచే పాదయాత్ర
తన తండ్రి తరహాలోనే చేవెళ్ల నుండి షర్మిల పాదయాత్ర ప్రారంభించి..తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కవర్ చేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ, టీఆర్ఎస్ నుండి ఈ విమర్శలకు స్పందన ఉండటం లేదు. దీన ద్వారా షర్మిలను లైట్ గా తీసుకోవాలని గులాబీ దళం భావిస్తోందా..లేక ఇది వ్యూహాత్మక మౌనమా అనేది రానున్న రోజుల్లో తేలనునంది. అయితే, ఇక.. రాజకీయంగా షర్మిల సైతం తెలంగాణలో పూర్తిగా బీజీగా మారిపోనున్నారు. మరి తెలంగాణ సమస్యల విషయంలో ఏపీతో సంబంధం ఉన్న అంశాల మీద తన అన్నపైన షర్మిల ఏ రకంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరమే.












Click it and Unblock the Notifications