వైఎస్ షర్మిల పార్టీ పేరు ఇదే: జులై 8న వైఎస్ జయంతి రోజు ప్రకటన
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న వైఎస్ షర్మిల తన పార్టీని ప్రారంభిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. వైయస్సార్ తెలంగాణ పార్టీగా వారి పార్టీని రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా షర్మిల పార్టీపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
వైయస్సార్టీపీ ఛైర్మన్ వాడుక రాజగోపాల్ సోమవారం మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్ సంక్షేమ పాలన తెలంగాణలో మళ్లీ తీసుకురావడం కోసం, ఆయన ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింభించేలా వైఎస్ షర్మిల పార్టీ ప్రారంభిస్తున్నారని తెలిపారు. వైయస్సార్ అందించిన సంక్షేమం ప్రతి ఇంటికి మళ్లీ చేరేలా వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినట్లు చెప్పారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రే ప్రక్రియ పనులన్నీ కూడా ఎన్నికల సంఘం వద్ద పూర్తనైట్లు తెలిపారు. అంతేగాక, తమ పార్టీ పేరుపై ఎటువంటి అభ్యంతరం లేదని వైఎస్ విజయమ్మ ఇచ్చిన లేఖను కూడా పార్టీ పేరుకు మద్దతుగా ఎన్నికల సంఘంకు ఇచ్చినట్లు తెలిపారు.
వైయస్సార్టీపీ పేరుపై అభ్యంతరాలుంటే తెలపాలని కేంద్ర ఎన్నికల సంఘం తమ వెబ్సైట్లో ఏప్రిల్ 30 పేర్కొందని.. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరం రాలేదని ఆయన తెలిపారు. దీంతో తమ పార్టీకి అనుమతుల ప్రక్రియ పూర్తయినట్లు భావిస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించిన మిగితా వివరాలన్నీ ప్రకటిస్తామని రాజగోపాల్ తెలిపారు. జులై 8న వైయస్సార్ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల తన పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ సర్కారును పలు సమస్యలపై షర్మిల నిలదీస్తున్న విషయం తెలిసిందే.