ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభపై అనుమానాలు: పోలీసులు అనుమతి ఇచ్చినా..కొత్త అడ్డంకి
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలకు తొలి ప్రయత్నంలోనే అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేనెల 9వ తేదీన ఖమ్మంలో ఆమె నిర్వహించి తలపెట్టిన భారీ బహిరంగ సభ నిర్వహణపై అనుమానాలు నెలకొంటోన్నాయి. బహిరంగ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ.. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయోననే సందేహాలు పార్టీ నేతల్లో వ్యక్తమౌతోన్నాయి. దీనికి కారణం- తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులే.
లక్షమందితో ఖమ్మం సభ
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ అభిమానులు, సానుభూతిపరుల మధ్య పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించడానికి వైఎస్ షర్మిల ఏర్పాట్లు చేస్తోన్నారు. ఈ సభకు రెండు నుంచి మూడు లక్షల వరకు జనాన్ని సమీకరించాలని భావిస్తున్నారు. జిల్లాలవారీగా దీనికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోన్నారు. అధికార తీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లల్లో అసంతృప్త నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకోవడానికీ సన్నాహాలు చేస్తోన్నారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ లేదా ఎస్సార్ అండ్ బీజీఎన్నార్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ సభను ఏర్పాటు చేయనున్నారు.
కరోనా కేసుల ఎఫెక్ట్..
అక్కడిదాకా అంతా బాగానే ఉన్నప్పటికీ- తెలంగాణ రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ప్రభావం.. ఈ బహిరంగ సభపై పడొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి. తెలంగాణలో కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా 337 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు మూడువేలకు చేరువ అయ్యాయి. ఖమ్మం జిల్లాలోనూ దీని తీవ్రత చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటోంది. కొద్దిరోజులుగా క్రమం తప్పకుండా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం.. ఖమ్మంలో తొమ్మిది కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి.
ప్రభావం ఎలా ఉండొచ్చు..
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని షర్మిల నిర్వహించ తలపెట్టిన సభకు జిల్లా పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. సభను నిర్వహించడానికి ఇదివరకే ఇచ్చిన అనుమతిని కొనసాగిస్తూనే.. హాజరయ్యే అభిమానుల సంఖ్యను కుదించాలంటూ సూచించవచ్చని అంటున్నారు. పరిమితంగా మాత్రమే అభిమానులు హాజరయ్యేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటారని సమాచారం. అదే జరిగితే- బహిరంగ సభను ఓపెన్ గ్రౌండ్లో కాకుండా.. ఇండోర్ లేదా ఆడిటోరియంలో ఏర్పాటు చేసేలా షర్మిల పార్టీ నేతలు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు.
కేసులు తగ్గుతాయనే గ్యారంటీ లేదు..
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి కఠిన ఆంక్షలు విధించారు. రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. తెలంగాణలోనూ మళ్ళీ వారాంతపు రోజుల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలు నెలకొన్నాయి. షర్మిల సభ నిర్వహించే తేదీ నాటికి కరోనా కేసుల సంఖ్య మరింత పెరగదనే గ్యారంటీ లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో షర్మిల సభపై ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని తెలుస్తోంది. పార్టీ పేరును ప్రకటించాల్సి ఉన్నందున సభను వాయిదా వేయకపోవచ్చని, ఆంక్షలకు లోబడే దాన్ని నిర్వహిస్తారని అంటున్నారు.