వైఎస్ షర్మిల పాదయాత్రలో వైవీ సుబ్బారెడ్డి: వైఎస్ జగన్ దూతగా? తెచ్చిన సందేశం ఏంటీ?
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టిన ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర ఆదివారం నాటికి అయిదో రోజుకు చేరుకుంది. బుధవారం నుంచి ఆమె తెలంగాణలో మహా పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టౌన్లో బహిరంగ సభను నిర్వహించిన అనంతరం ఆమె పాదయాత్ర మొదలైంది. తల్లి వైఎస్ విజయమ్మ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాచారం నుంచి మొదలు..
చేవెళ్ల, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. ప్రస్తుతం మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది ఈ పాదయాత్ర. అయిదో రోజు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని నాగారం నుంచి మహా పాదయాత్ర మొదలైంది. ఈ ఉదయం 9:30 గంటలకు తాను బస చేసిన క్యాంప్ నుంచి బయలుదేరారు. 9:45 నిమిషాలకు కొత్తగూడ క్రాస్కు చేరుకున్నారు. అక్కడ ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మన్సాన్ పల్లి వద్ద మధ్యాహ్న భోజన విరామం..
10:15 నిమిషాలకు డబ్లిగూడ క్రాస్, 10:30 నిమిషాలకు మన్సాన్ పల్లి చౌరస్తా వద్దకు చేరుకున్నారు. ప్రజలను పలకరించారు. వారితో ముఖాముఖిగా కొద్దిసేపు మాట్లాడారు. 11:15 నిమిషాలకు మన్సాన్ పల్లి గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామం కోసం అక్కడే ఆగారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర మొదలవుతుంది. మన్సాన్ పల్లి నుంచి కొత్వాల్ చెరువు తండాకు చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకు మహేశ్వరం టౌన్కు చేరుకుంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు మహేశ్వరం విలేజ్లో విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
పాదయాత్రలో ప్రత్యక్షమైన వైవీ సుబ్బారెడ్డి
కాగా- వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలో ఓ అనూహ్య అతిథి కనిపించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ పాదయాత్రలో కనిపించారు. వైవీ సుబ్బారెడ్డి.. స్వయానా వైఎస్ షర్మిలకు బాబాయ్. ఈ ఉదయం ఆయన అమరావతి నుంచి కొత్తగూడకు చేరుకున్నారు. వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు వారిద్దరి మధ్య ఈ భేటీ కొనసాగింది.
26 సమన్వయ కమిటీలు..
పాదయాత్ర ముగిసిన అనంతరం పార్టీ నేతలతో సమావేశమౌతారు. ఆ రోజు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల గురించి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో ఒక నోట్ను తయారు చేస్తారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేస్తారు. పాదయాత్రను విజయవంతం చేయడానికి వైఎస్సార్టీపీ అగ్ర నాయకత్వం కోఆర్డినేషన్ కమిటీలను కూడా నియమించింది. మొత్తంగా 26 సమన్వయ కమిటీలు వైఎస్ షర్మిల పాదయాత్ర కోసం పని చేస్తోన్నాయి.
వైఎస్ జగన్ దూతగా..
వైఎస్ షర్మిల అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దూతగా వైవీ సుబ్బారెడ్డి పాదయాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది.
షర్మిలను కలుసుకోవడానికి వచ్చిన ఆయనను వైఎస్సార్టీపీ సీనియర్ నాయకుడు కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, వాడుక రాజగోపాల్, సయ్యద్ ముజ్తాబా అహ్మద్, మతీన్ ముజాద్దాది సాదరంగా ఆహ్వానించారు. పాదయాత్ర కొనసాగుతున్న తీరును వైవీ సుబ్బారెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు.
తోబుట్టువు క్షేమ సమాచారంపై ఆరా..
పాదయాత్ర మొదలు పెట్టి అయిదవ రోజుకు చేరుకున్నందున.. తన తోబుట్టువు ఆరోగ్య పరిస్థితి, క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికి వైఎస్ జగన్.. తన బాబాయ్, అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న వైవీ సుబ్బారెడ్డిని పంపించినట్లు చెబుతున్నారు. పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు.. ఈ అయిదు రోజుల్లో వచ్చిన ప్రజల స్పందన గురించి ఆరా తీశారని చెబుతున్నారు. పాదయాత్ర కొనసాగింపు విషయంపైనా వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
సాయంత్రం వైఎస్ విజయమ్మతో భేటీ..
కాగా- ఈ సాయంత్రం వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మను కలుస్తారని సమాచారం. వైఎస్ షర్మిలను కలుసుకున్న అనంతరం వైవీ సుబ్బారెడ్డి నేరుగా లోటస్ పాండ్ నివాసానికి వెళ్తారని, అక్కడ విజయమ్మతో భేటీ అవుతారని చెబుతున్నారు. వైఎస్ జగన్.. అందజేసిన సమాచారంపై విజయమ్మతో చర్చిస్తారని, ఆ తరువాత ఓ నిర్ణయానికి వస్తారని అంటున్నారు. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది వైఎస్ విజయమ్మ మీదే ఆధారపడి ఉంటుందని సమాచారం.