వైసీపీ నేత పీవీపీ అరెస్టు: కాస్సేపట్లో జ్యుడీషియల్ కస్టడీకి: చావడం మిన్న అంటూ కామెంట్స్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) అరెస్టు అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హౌస్ కస్టడీకి తరలించారు. కాస్సేపట్లో జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ప్రేమ్ పర్వత్ ప్రాంతంలో నివసించే కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీవీపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Recommended Video
అచ్చెన్న అరెస్టులో మరో అడుగు: మూడు రోజుల ఏసీబీ కస్టడీ: జీజీహెచ్ లేదా: బెయిల్ పిటీషన్పై
రూఫ్ గార్డెన్ విషయంలో తలెత్తిన గొడవ..
పీవీపీ కూడా ప్రేమ్ పర్వత్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఆయన ఇంటి వెనుక ఉన్న విల్లాలో కైలాష్ విక్రమ్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు భార్య, కుమార్తె, తల్లి ఉన్నారు. నిజానికి- పీవీపీ నుంచి ఈ విల్లాను కైలాష్ కొనుగోలు చేశారు. ఈ విల్లాపై రూఫ్ గార్డెన్ను ఏర్పాటు చేయడానికి ఆయన ప్రయత్నించారు. రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేయడం పట్ల పీవీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రూఫ్ గార్డెన్ నిర్మించ వద్దంటూ కైలాష్కు సూచించారు. కైలాష్ దీన్ని పట్టించుకోలేదు. తన ప్రయత్నాలను కొనసాగించారు.
కైలాష్ ఇంటిపై దౌర్జన్యం..
ఈ విషయంలో ఇద్దరి మధ్యా మాటమాట పెరిగింది. దీనితో పీవీపీ సుమారు 20 మంది తన అనుచరులతో కలిసి తన కైలాష్ విక్రమ్ ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లో వస్తువులను చిందర వందర చేశారు. రూఫ్ గార్డెన్ కోసం తీసుకొచ్చిన వస్తువులు, ఇతర నిర్మాణ సామాగ్రిని ధ్వంసం చేశారు. ఆయనను అడ్డుకోవడానికి కైలాష్ విక్రమ్ ప్రయత్నించినప్పటికీ.. వినిపించుకోలేదు. దౌర్జన్యానికి దిగారు. దీనితో ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆరు నెలలుగా
తాను విల్లాను కొనుగోలు చేసిన తరువాత ఆరు నెలలుగా పీవీపీ తనను బెదిరిస్తూనే ఉన్నారని కైలాష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విల్లాలో ఎలాంటి నిర్మాణాలు గానీ, మార్పులు చేర్పులు గానీ చేయొద్దంటూ హెచ్చరిస్తున్నారని అన్నారు. ఫలితంగా రూఫ్ గార్డెన్ను ఏర్పాటు చేయాలనుకుంటోన్న తన కోరికను ఆరు నెలలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్నానని ఆయన పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పొందుపరిచారు. చివరికి- ధైర్యం చేసి తాను రూఫ్ గార్డెన్ నిర్మాణానికి పూనుకున్నానని అన్నారు.
భయభ్రాంతులకు గురి
పీవీపీ సహా ఆయన అనుచరులు 20 మంది ఒకేసారి తన ఇంటి మీదికి దాడి చేశారని, తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని కైలాష్ ఆరోపించారు. వృద్ధురాలైన తన తల్లి షాక్కు గురయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో విలువైన వస్తువులు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారని అన్నారు. రూఫ్ గార్డెన్ కోసం కొనుగోలు చేసిన వస్తువులను చిందరవందర చేయడంతో పాటు వాటిని వెనక్కి పంపించారని చెప్పారు. తన ఇంట్లో తాను మార్పులు చేర్పులు చేసుకోవడానికి పీవీపీ అభ్యంతరం చెప్పడమేంటని ప్రశ్నించారు.
పిలిపించి మాట్లాడినా
కైలాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పీవీపీని, కైలాష్ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. దీనితో పీవీపీని అదుపులోకి తీసుకున్నామని బంజారాహిల్స్ అదనపు ఇన్స్పెక్టర్ కే రవికుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. బుధవారం రాత్రి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని హౌస్ కస్టడీకి పంపించారని, అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తారని పేర్కొంది.
నోరు మూసుకునే కన్నా.. చావడం మిన్న
కాగా.. తాజాగా పీవీపీ చేసిన ఓ ట్వీట్ సంచలన రేపుతోంది. తప్పుని తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. తప్పుని తప్పుగా ఎత్తిచూపడంలో తప్పు లేదని అన్నారు. ఈ విషయంలో నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న అంటూ కామెంట్స్ చేశారు.