ఎనిమిదో రోజుకు చేరిన వైఎస్ షర్మిల పాదయాత్ర: కంప్లీట్ షెడ్యూల్ ఇదే: ఇబ్రహీపట్నంలో ఎంట్రీ
హైదరాబాద్: తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి సమగ్ర అవగాహనను ఏర్పరచుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టిన మహా పాదయాత్ర.. బుధవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ నెల 20వ తేదీన ఆమె రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగాల్సి ఉంది.
చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర సాగుతోంది. ఈ సాయంత్రానికి పాదయాత్ర ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. చేవెళ్ల, శంషాబాద్ తరువాత మహేశ్వరంలో బహిరంగ సభను నిర్వహించారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలను గుప్పిస్తున్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను ప్రభుత్వం దృఫ్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోన్నారు.

ప్రస్తుతం షర్మిల పాదయాత్ర మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. తిమ్మాపూర్లో మంగళవారం రాత్రి ఆమె బస చేశారు. ఈ ఉదయం 9:30 గంటలకు తన పాదయాత్రను ప్రారంభిస్తారు. తాను బస చేసిన క్యాంప్ నుంచి బయలుదేరుతారు. 10 గంటలకు రాచలూర్కు చేరుకుంటారు. 10:45 నిమిషాలకు గాజులపురుగు తండా క్రాస్, 11:15 నిమిషాలకు బేగంపేట్ విలేజ్కు చేరుకుంటారు. ప్రజలతో ముచ్చటిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలు బేగంపేట్ సమీపంలో భోజనం కోసం విరామం తీసుకుంటారు. మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకుంటారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్రను పునఃప్రారంభిస్తారు. 3:30 గంటలకు మాధాపూర్ విలేజ్, 4:30 గంటలకు ఎలిమినేడు విలేజ్కు చేరుకుంటారు. ఎలిమినేడులో అడుగు పెట్టడంతో.. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తయినట్టవుతుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.
ఎలిమినేడు విలేజ్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కిందికి వస్తుంది. అక్కడ ప్రజలతో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు. వారి నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఎలిమినేడు విలేజ్ సమీపంలో బస చేస్తారు. బహిరంగ సభను నిర్వహించట్లేదు. దాని స్థానంలో ఎలిమినేడులో మాట-ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. షర్మిలక్కతో మాటా-ముచ్చట కార్యక్రమాన్ని చేపడతామని తెలిపాయి.












Click it and Unblock the Notifications